● శాసన మండలి డిప్యూటీ చైర్మన్
బండా ప్రకాశ్
నర్సంపేట: సెప్టెంబర్ 16 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగే బొజ్జా తారకం పదో వర్ధంతి సభలను జయప్రదం చేయాలని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ కోరారు. ఈ మేరకు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా ముద్రించిన కరపత్రాలను ఆదివారం హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో అట్టడుగు, మధ్య తరగతి పేద ప్రజల పక్షాన నిలబడి ప్రజా ఉద్యమ నాయకుడిగా, హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయవాదిగా తన జీవితాన్ని ప్రజల కోసం, ప్రజా హక్కుల సాధన కోసం అంకితం చేసిన గొప్ప ప్రజా నాయకుడని బొజ్జా తారకమని కొనియాడారు. ఆర్పీఐ రాష్ట్ర అధ్యక్షుడు జన్ను సాంబయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 1995నుంచి 2010వరకు జరిగిన అక్రమాలపై ఆనాటి పాలక ప్రభుత్వాలను ప్రశ్నించారని తెలిపారు. ప్రభుత్వ భూముల వివరాలను బహిర్గతం చేయాలని, ఆ భూములను ప్రజలకు పంపిణీ చేయాలని ఆనాటి ముఖ్యమంత్రులను బొజ్జా తారకం నిలదీశారని గుర్తుచేశారు. తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన తారకం ఆశయాలను కొనసాగించాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్పీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంకేశ్వర రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎడ్ల రవి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు శ్రీరాముల పైడి, జిల్లా ప్రధాన కార్యదర్శి గునిగంటి రమేష్ పాల్గొన్నారు.


