నేడు రాకెట్ ట్రయల్ రన్
నయీంనగర్: జాతీయ సైన్స్ దినోత్సవం (ఫిబ్రవరి 28) సందర్భంగా భద్రకాళి బండ్ ప్రామినాడ్ వద్ద నిర్వహించనున్న రుద్రమ–1 రాకెట్ ప్రయోగానికి ముందు శుక్రవారం ఉదయం 11 గంటలకు ట్రయల్ రన్ చేయనున్నట్లు హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ తెలిపారు. కుడా కార్యాలయంలో పోలీస్, రెవెన్యూ, విద్య, కుడా, మున్సిపల్ శాఖల అధికారులు, రాకెట్ రూపకర్త శశాంక్ భూపతి, నిట్ ప్రొఫెసర్ అంజన్కుమార్తో కలెక్టర్ గురువారం సమన్వయ సమావేశం నిర్వహించారు. భద్రతా చర్యులు, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలు, ప్రజల రాకపోకలు, సమన్వయ విధానాలు తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శనివారం సాయంత్రం 5:30 గంటలకు భద్రకాళి బండ్ వద్ద రాకెట్ లాంచింగ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అదేరోజు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు కాళోజీ కళాక్షేత్రంలో ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా ఫౌండర్ సెక్రటరీ, డైరెక్టర్ ఎన్.రఘునందన్ కుమార్, ఇస్రో విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ శేషగిరిరావు వెల్లంకి రాకెట్ ప్రయోగంపై ప్రసంగిస్తారని తెలిపారు. రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు విద్యార్థులు, ప్రజలకు సాయంత్రం 4 గంటల నుంచి ఉచిత ప్రవేశం ఉందని తెలిపారు. సమావేశంలో డీఈఓ గిరిరాజ్గౌడ్, ఎంఆర్ఓ రవీందర్రెడ్డి, కుడా సీపీఓ అజిత్రెడ్డి, ఈఈ భీంరావు, అధికారులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్
చాహత్ బాజ్పాయ్
కుడా కార్యాలయంలో
అధికారులతో సమీక్ష


