కేఎంటీపీ పనుల్లో వేగం పెంచాలి
● పూర్తి చేస్తే మరిన్ని పరిశ్రమలకు
అవకాశం
● కలెక్టర్ సత్యశారద
గీసుకొండ: కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు(కేఎంటీపీ)లో మౌలిక వసతులు, సదుపాయాల కల్పన పనులను నాణ్యతతో సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సత్యశారద సంబంధిత అధికారులను ఆదేశించారు. గీసుకొండ–సంగెం మండలాల పరిధిలోని కేఎంటీపీలో జరుగుతున్న పనులను సంబంధిత శాఖల అధికారులతో కలిసి గురువారం ఆమె పరిశీలించారు. రహదారుల నిర్మాణం, ఆర్ఓబీ, గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి కేఎంటీపీకి రహదారి, విద్యుత్, తాగునీటి వసతుల పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడారు. పనులు సకాలంలో పూర్తయితే మరిన్ని పరిశ్రమల వచ్చే అవకాశం ఉంటుందని, తద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్టీఓ సుమ, జిల్లా పరిశ్రమల మేనేజర్ స్వామి, గీసుకొండ, సంగెం తహసీల్దార్లు ఎండీ రియాజుద్దీన్, రాజ్కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల సందర్శన
మండలంలోని ధర్మారం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను గురువారం కలెక్టర్ సత్యశారద సందర్శించారు. పాఠశాలలో అమలవుతున్న విద్యా కార్యక్రమాలను, పరీక్షల విధానాన్ని పరిశీలించారు. ఉపాధ్యాయులు అంకిత భావంతో బోధన చేసి విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలన్నారు. డీఈఓ రంగయ్యనాయుడు, ఏఎంఓ సుజన్తేజ, ఎంఈఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
భూసేకరణ చేపట్టాలి
న్యూశాయంపేట: జిల్లాలో చేపట్టనున్న జే.చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కెనాల్ నిర్మాణానికి అవసరైన భూసేకరణ ప్రక్రియను ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతిపై సంబంధిత శాఖల అధికారులతో గురువారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రాజెక్ట్ పనులు సకాలంతో పూర్తయితే రైతులకు సాగునీరు అందుబాటులోకి వచ్చి వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుందన్నారు. శాఖల మధ్య సమన్వయంతో సమస్యలు తలెత్తిన వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, సంబంధిత తహసీల్దార్లు, ఇరిగేషన్ శాఖలు, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.


