అధికారంలో లేరు.. హామీలు ఎలా ఇస్తారు?
వర్ధన్నపేట: అధికారంలో లేరు.. ఎన్నికల్లో హామీలు ఎలా ఇస్తారు.. ఎలా తీరుస్తారు అని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రతిపక్షాలను ప్రశ్నించారు. మున్సిపాలిటీ పరిధిలోని డీసీ తండా, అంబేడ్కర్ సెంటర్, పాత మున్సిపాలిటీ సెంటర్లలో 12 వార్డుల నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులతో శనివారం నిర్వహించిన కార్నర్ షోకు ఆయన హాజరై మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల నాయకుల హామీలను ప్రజలు ఎలా నమ్ముతారని ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పేద ప్రజలకు పక్కా ఇళ్లు వర్ధన్నపేటలో ఎందుకు నిర్మించలేదని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణంలో 150 మందికి ఇళ్లు నిర్మించిందని, మరో మూడేళ్లలో మూడు దఫాలుగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరుచేస్తుందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మాదిరిగానే ప్రభుత్వ భూముల్లో పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. నివేశిత స్థలాలు ఇవ్వడానికి రెవెన్యూ మంత్రిగా, పక్కా ఇళ్ల నిర్మాణాలకు గృహనిర్మాణ శాఖ మంత్రిగా, జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా తాను ఉండడంతో పనులు చకచకా సాగుతాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే మరికొన్ని తీపి కబుర్లు చెబుతామన్నారు. పట్టణంలోనే వంద పడకల ఆస్పత్రి నిర్మిస్తామని ఇందులో ఎలాంటి అనుమానాలకు తావు లేదని పొంగులేటి స్పష్టం చేశారు. కోనారెడ్డి చెరువు కాల్వకు సీసీ లైనింగ్ చేయడంతోపాటు రిజర్వాయర్ నుంచి ప్రత్యేక కెనాల్ను నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, టెస్కాబ్ మాజీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, కుడా చైర్మన్ వెంకట్రాంరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ఎండీ అయూబ్ పాల్గొన్నారు.
ప్రతిపక్షాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రశ్న
వర్ధన్నపేట పట్టణంలో కాంగ్రెస్
అభ్యర్థులతో కార్నర్ షో


