సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి.. | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి..

Jul 25 2024 1:32 AM | Updated on Jul 25 2024 1:01 PM

-

వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు నీరు నిల్వ ఉండడం, పరిసరాల పరిశుభ్రత లోపించడం, తాగు నీరు కలుషితం వల్ల వివిధ రకాల వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ సాంబశివరావు అన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, పంచాయతీ, మున్సిపల్‌ సిబ్బంది సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

కీటక జనిత వ్యాధులు, అంటువ్యాధులకు సంబంధించిన అన్ని రకాల మందులు, వ్యాధి నిర్ధారణ కిట్లు అన్ని ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ఆరోగ్య సిబ్బంది ద్వారా ఇంటింటికీ తిరిగి జ్వర సర్వే నిర్వహించి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సీజనల్‌ వ్యాధుల నియంత్రణలోనూ ప్రజలు సహరించాలని కోరారు. దోమల ఉత్పత్తిని తగ్గించడానికి, ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని కోరారు.

కలుషిత నీటి నివారణ కోసం క్లోరినేషన్‌ చేసిన లేదా కాల్చి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. అపరిశుభ్ర ఆహారాన్ని తీసుకోవద్దని, ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే సంబంధిత ఆస్పత్రిని, వైద్యాధికారిని సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement