వనపర్తి: ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. మంగళవారం మర్రికుంట గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో క్రికెట్, హాకీ వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించడంతో పాటు సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన క్విజ్, డ్రాయింగ్ పోటీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి క్విజ్, చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు ఎంతగానో దోహదపడతాయని, అందుకే ప్రభుత్వం సంక్షేమ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు టాలెంట్ ఫెస్ట్ నిర్వహిస్తోందన్నారు. వేసవి శిబిరం మే నెల 29 వరకు కొనసాగుతుందని.. విద్యార్థులు సద్వినియోగం చేసుకొని కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు. అనంతరం కలెక్టర్ పాఠశాల వంట గదిని పరిశీలించి స్వచ్ఛతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. వంటగదిలో స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి మెస్ కమిటీ విద్యార్థులు సంతకాలు చేస్తున్నారా లేదా అన్న విషయంపై విచారణ చేశారు. విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సరైన సమాధానాలు చెప్పిన వారిని అభినందించారు. విద్యార్థులకు మంచి ఆహారం అందించాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రమేష్రెడ్డి, ప్రిన్సిపాల్ సరస్వతి, పాఠశాల సిబ్బంది, అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


