వనపర్తిటౌన్: ఆర్టిజన్ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు అయ్యగారి ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లాకేంద్రంలో వనపర్తి డివిజన్ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె శిబిరాన్ని శుక్రవారం బీజేపీ నాయకులు సందర్శించి వారికి మద్దుతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పది రోజులుగా ఆర్టిజన్ కార్మికులు సమ్మె చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం విస్మయానికి గురిచేస్తోందన్నారు. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ధర్నాలు, సమ్మెలు చేస్తున్న వారిని ఉద్దేశించి వీటిని పరిష్కరించడం టీ తాగిన సమయం కాదని గొప్పగా చెప్పారని.. ఇప్పటిదాకా ఆ సమయం రాలేదా అని ప్రశ్నించారు. ఆర్టిజన్లు తమ డిమాండ్లు పూర్తిగా సాధించే వరకు పూర్తి మద్దతు ఉంటుందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు ఆదేశాల మేరకు మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు ఆర్.వెంకటేశ్వర్రెడ్డి, జిల్లా ప్రధానకార్యదర్శులు పెద్దిరాజు, శ్రీనివాస్గౌడ్, ఎస్సీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షుడు ఆగపోగు కుమార్, పట్టణ అధ్యక్షుడు రాజశేఖర్గౌడ్, యువమోర్చా పట్టణ అధ్యక్షుడు ఎద్దుల రాజు తదితరులు పాల్గొన్నారు.


