వనపర్తి: రెవెన్యూ అదనపు కలెక్టర్గా వినోద్కుమార్ సోమవారం కలెక్టరేట్లోని తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈయన తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విభాగంలో పనిచేసి బదిలీపై ఇక్కడకు వచ్చారు. అంతకుముందు కలెక్టర్ ఆదర్శ్ సురభిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ విభాగానికి సంబంధించిన అంశాలపై ఇరువురు చర్చించారు.
ఎస్పీ ప్రజావాణికి
ఆరు వినతులు
వనపర్తి: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఆరుగురు వినతులు వచ్చాయి. డీసీఆర్బీ డీఎస్పీ బాలాజీనాయక్ అర్జీదారులతో వినతులు స్వీకరించి వారితో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఫిర్యాదులను చట్టబద్ధంగా, వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం జరిగే విధంగా పోలీసుశాఖ ఎల్లప్పుడూ అంకితభావంతో పని చేస్తోందన్నారు. ప్రజలు పోలీసుశాఖపై నమ్మ కం ఉంచి సమస్యల పరిష్కారానికి ప్రజావాణి ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నిబంధనల మేరకే
ధాన్యం కొనుగోళ్లు
వీపనగండ్ల: ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ రైతుల నుంచి వరి ధాన్యం సేకరించాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి కాశీవిశ్వనాథం, డీపీఎం ప్రభాకర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రాల సిబ్బంది, మహిళా సమాఖ్య సభ్యులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి వారు హాజరై పలు సూచనలు చేశారు. దొడ్డు, సన్నరకం ధాన్యం గుర్తించే విధానాన్ని వివరించారు. తేమశాతం 17 ఉండేలా చూసుకోవాలని, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే సమయంలోనే పూర్తిస్థాయిలో అవగాహన కల్పించే బాధ్యత అధికారులపై ఉందన్నారు. మండల వ్యవసాయ అధికారులు ఆంజనేయులు, డాకేశ్వర్గౌడ్, ఏపీఎం మద్దిలేటి, అనిల్కుమార్, సింగిల్విండో ఏఓ రాము, పలువురు ఏఈఓలు పాల్గొన్నారు.


