కొత్తకోట రూరల్: చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ న్యాయమూర్తి వి.రజిని అన్నారు. సోమవారం పట్టణంలోని వెంకటేశ్వర ఐటీఐ కళాశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు ప్రస్తుత సమాజంలో జరుగుతున్న వివిధ నేరాలు, చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న ఐటిఐ విద్యార్థులకు మోటారు వాహనాల వినియోగం, వాటి నిర్వహణకు సంబంధించిన ప్రాథమిక చట్టాలు, మైనర్ డ్రైవింగ్తో కలిగే ప్రమాదాలు, వాటి పరిణామాల గురించి తెలిసి ఉండాలని సూచించారు. అదేవిధంగా మైనర్లకు సంబంధించిన ముఖ్యమైన చట్టాలు పోక్సో–2012, బాల్య వివాహాల నిషేధం, రాజ్యాంగంలోని ఆర్టికల్ 39ఏ వంటి అంశాల గురించి వివరించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెనన్స్ కౌన్సిల్ ఎం.రఘు, ఐటీఐ కళాశాల చైర్మన్ విశ్వనాథం గంగాధర్శెట్టి, కళాశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


