
క్రమశిక్షణ, సమయపాలనతో గుర్తింపు
వనపర్తి: క్రమశిక్షణ, సమయపాలన పాటిస్తూ, విధులు సక్రమంగా నిర్వర్తిస్తూ అధికారుల మన్ననలు పొందాలని.. నీతి, నిజాయితీతో పనిచేసే వారికి పోలీసుశాఖలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల సిబ్బందికి విధుల నిర్వహణపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర కీలకమని.. పోలీసుశాఖలో పనిచేసే ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని, బాధ్యతగా విధులు నిర్వర్తిస్తూ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. స్టేషన్కు వచ్చే ప్రతి ఒక్కరితో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారి సమస్యలు తెలుసుకోవాలని, న్యాయం జరుగుతుందనే నమ్మకం, భరోసా, భద్రత కల్పించాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, వివిధ వర్టికల్ విభాగాల్లో చక్కటి ప్రతిభ కనబర్చాలని, ఐటి సెల్ సేవలు వినియోగించుకొని జిల్లాను ముందువరుసలో నిలపడానికి కృషి చేయాలని కోరారు. అనంతరం విధుల్లో ఉత్తమ ప్రతిమ కనబర్చిన పోలీసు సిబ్బందిని ఎస్పీ శాలువాలు, జ్ఞాపికలతో సన్మానించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, వనపర్తి సీఐ కృష్ణయ్య, ఆత్మకూర్ సీఐ శివకుమార్, రిజర్వ్ సీఐ అప్పలనాయుడు, డీసీఆర్బీ ఎస్ఐ రవిప్రకాష్ పాల్గొన్నారు.