
వీడని సందిగ్ధం!
జిల్లా కేంద్రంలో రహదారుల విస్తరణపై మీనమేషాలు
●
పురోగతిలో ఉంది..
రహదారి విస్తరణ పనులు పురోగతిలో ఉన్నాయి. బాధితులకు న్యాయం చేసే దిశగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. కర్నూలు రోడ్డులో ఆక్రమణదారులకు నోటీసులు జారీ చేశాం. దీంతో పాటు దుకాణాలు, నివాసగృహాల అనుమతి పత్రాల జిరాక్స్ అందించాలని యజమానులను కోరాం. ప్రజల భాగస్వామ్యం పెంచి విస్తరణ చేయాలని ఎమ్మెల్యే, కలెక్టర్ యోచిస్తున్నారు. – ఎన్.వెంకటేశ్వర్లు,
మున్సిపల్ కమిషనర్, వనపర్తి
భవనాలు తొలగిస్తేనే..
జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేసేందుకు సిద్దంగా ఉన్నాం. పురపాలిక అధికారులు రహదారి విస్తరణకు అడ్డుగా ఉన్న భవనాలను తొలగిస్తేనే పనులు ప్రారంభమవుతాయి. కర్నూలు రోడ్డును ఎంత విస్తరించాలనేది స్పష్టత రావాల్సి ఉంది.
– రాకేశ్, ఆర్అండ్బీ ఏఈ
వనపర్తి టౌన్: జిల్లా కేంద్రమైన వనపర్తిలో రహదారుల విస్తరణపై నెలకొన్న సందిగ్ధం వీడటం లేదు. నెలరోజుల క్రితం విస్తరణ పనులను ప్రారంభిస్తున్నట్టు హడావుడి చేసిన అధికారులు.. ఒక్కసారిగా మిన్నకుండిపోయారు. 2020 ఏప్రిల్ 25న సుమారు రూ. 45కోట్లతో చేపట్టిన రహదారుల విస్తరణ పనులు.. 2023 ఆగస్టులో నిలిచిపోయాయి. తదనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అడపాదడపా రోడ్ల విస్తరణలో కదలిక కనిపిస్తున్నా.. కార్యాచరణలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన మారిపోయింది. పాన్గల్ రోడ్డు విస్తరణలో నివాసగృహాలు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు నష్టపరిహారంపై స్పష్టత లేకుండా పోయింది. కర్నూలు రోడ్డు విస్తరణ పరిధిని తేల్చడం లేదు. ఈ రోడ్డు 100 అడుగుల లేక 80 అడుగుల అనేది అధికారులు సైతం స్పష్టత ఇవ్వడం లేదు. అయితే కర్నూలు రోడ్డులో 18 అక్రమ నిర్మాణాలు ఉన్నాయని మున్సిపల్శాఖ నోటీసులు జారీ చేసినా.. వా టిపై తదుపరి కార్యాచరణపై మీనమేషాలు లెక్కిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్య దోరణితో కర్నూలు రోడ్డు విస్తరణపై సందిగ్ధం నెలకొంది.
ఇంకా తేలని కర్నూలు రోడ్డు విస్తరణ పరిధి
పరిహారంపై కొరవడిన స్పష్టత
మూడు, ఆరు నెలలకోసారి
హడావుడి చేస్తున్న అధికారులు