
విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత
కొత్తకోట: దేవరకద్ర నియోజకవర్గంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. సీఎస్ఆర్ నిధులు రూ. 1.50 కోట్లతో మంగళవారం కొత్తకోట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో అదనపు గదుల నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అదే విధంగా అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ, సీబీఎఫ్ నిధులు రూ. 80లక్షలతో బాలుర ఉన్నత పాఠశాలలో నిర్మించిన అదనపు గదులను అదనపు కలెక్టర్ యాదయ్యతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలో పేదలకు మెరుగైన విద్య, వైద్యం అందించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని.. కొత్తకోట పట్టణ నడిబొడ్డున ఉన్న బాలికల ఉన్నత పాఠశాలలో కనీస మౌలిక వసతులు, తరగతి గదులు లేకున్నా ఏనాడూ పట్టించుకోలేదని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు పాఠశాలలో అదనపు గదుల నిర్మాణంతో పాటు మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్పొరేట్కు దీటుగా అన్ని వసతులతో పాఠశాలను తీర్చిదిద్దుతామన్నారు. అంతకు ముందు స్థానిక దండుగడ్డ అంగన్వాడీ కేంద్రంలో అమ్మమాట.. అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా చిన్నారులకు ఎగ్ బిర్యాన్నీ వడ్డించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పిల్లలతో కలిసి ఎగ్ బిర్యానీ రుచి చుశారు. అదే విధంగా బాల్యవివాహాలను అరికట్టాలనే సందేశంతో సంక్షేమశాఖ రూపొందించిన పోస్టర్ను అదనపు కలెక్టర్తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం మొక్కలు నాటారు. అదే విధంగా ఉద్యానశాఖ ఆధ్వర్యంలో 60 మంది రైతులకు సబ్సిడీపై స్ప్రింక్లర్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెపాగు ప్రశాంత్, డీఈఓ మహమ్మద్ అబ్దుల్ ఘని, జిల్లా సంక్షేమశాఖ అధికారిణి సుధారాణి, ఉద్యానశాఖ అధికారి ఎంఏ అక్బర్, మున్సిపల్ కమిషనర్ సైదయ్య, ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంఈఓ కృష్ణయ్య, హెచ్ఎం కె.నిర్మలాదేవి, వివేకానంద తదితరులు పాల్గొన్నారు.