
భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు
మదనపురం: భూ భారతి చట్టం ద్వారా భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటున్నట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం మదనాపురం మండలం దుప్పల్లిలో నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరై.. భూ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారం కోసం ఎవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం గ్రామాల్లోనే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో సాధ్యమైనంత వరకు రెవెన్యూ సదస్సుల్లోనే భూ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ జేకే మోహన్, ఆర్ఐ రాజేశ్వరి, సిబ్బంది సుచరిత, శ్రీధర్, నాయకులు చింతకుంట శేఖర్, నాగరాజు, అరుణ్, నరేందర్ తదితరులు పాల్గొన్నారు.