
పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేయాలి
వనపర్తి: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు వెంటనే పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో విద్యాశాఖ, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు ఏయే మండలంలో ఎంతమంది విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్స్ అందించారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో అన్ని తరగతులకు కలిపి 1,25,983 పాఠ్య పుస్తకాలు వచ్చాయని, వాటిలో ఇప్పటి వరకు 48,011 మంది విద్యార్థులకు పంపిణీ చేశామని, యూనిఫామ్స్ డీఆర్డీఓ, మెప్మా ద్వారా 34,665 వచ్చాయని.. అందులో మొదటి విడతగా ఒక జత దుస్తులు 12,737 మంది విద్యార్థులకు అందించినట్లు జిల్లా విద్యాధికారి వివరించారు. విద్యార్థులు పాఠశాలకు హాజరుకాగానే పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందిస్తున్నామని చెప్పారు. పాఠశాలల వారీగా నిర్ణీత ప్రొఫార్మాలో పూర్తి నివేదికను అందించాలని కలెక్టర్ ఆదేశించారు. 10వ తరగతి విద్యార్థులకు గణిత సామర్థ్య పరీక్ష నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. ఇందుకోసం మ్యాథమెటిక్స్ సబ్జెక్టు ఫోరం అధ్యాపకులు ప్రత్యేకంగా రూపొందించిన ప్రశ్నపత్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. నాలుగు సెట్ల ప్రశ్నపత్రం తయారు చేయాలని, ఈ వారంలో పరీక్ష నిర్వహించి కనీస మార్కులు రాని విద్యార్థులకు నెలరోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో ఏ ఒక్క విద్యార్థి గణితంలో ఫెయిల్ కావడానికి వీలులేదన్నారు. సమావేశంలో జిల్లా విద్యా ధికారి మహ్మద్ అబ్దుల్ ఘని, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామ్స్ గణేష్, డీఆర్డీఓ ఉమాదేవి, సీఎంఓ యుగంధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.