
అన్నదాతల ఆనందం
ప్రారంభమైన రైతుభరోసా నిధుల జమ
●
పెట్టుబడికి ఉపయోగం..
వానాకాలం సాగుకుగాను ప్రభుత్వం రైతుభరోసా నిధులను అందిస్తున్నట్లు ప్రకటించడం హర్షించదగిన విషయం. సకాలంలో చేతికందడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించే బాధ తప్పింది. యాసంగి మాదిరిగా రైతులు అయోమయానికి గురికాకుండా పూర్తి వివరాలు వెల్లడించాలి.
– తెలుగు పరశురాం, రైతు, పాన్గల్
సీఎం ప్రకటనతో ఉత్సాహం..
జూరాల ఎడమ కాల్వ ఆయకట్టులో 5 ఎకరాల పొలం ఉంది. రైతు భరోసా డబ్బులు సమయానికి అందితే పంట సాగుకు ఉపయోగపడుతాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతు భరోసా నిధులను తొమ్మిది రోజుల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించడం ఉత్సాహం కలిగించింది. వార్షాకాలం సాగుకు పెట్టుబడి కోసం ప్రైవేట్ వ్యక్తులతో అప్పులు చేద్దామనే సమయంలో రైతుభరోసా డబ్బులు మంజూరు చేయడం ఆనందంగా ఉంది.
– సుధాకర్, రైతు, మూలమళ్ల
అర్హులందరికీ రైతుభరోసా..
సోమవారం నుంచి తొమ్మిది రోజుల్లోగా అర్హులైన రైతులందరికీ రైతు భరోసా అందించాలని ఆదేశాలొచ్చాయి. తొలిరోజు సోమవారం 70 శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయం జమకానుంది. జూన్ 5వ తేదీ వరకు భూములు కొనుగోలు చేసిన వారికి పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రైతులు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలి.
– గోవింద్నాయక్,
జిల్లా వ్యవసాయ అధికారి
వనపర్తి: వానాకాలం సాగు సమయం ఆసన్నం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రైతుభరోసా (పెట్టుబడి సాయం) సాయాన్ని సోమవారం నుంచి పంపిణీ చేస్తుండటంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జిల్లాలో తొలిరోజు 70 శాతం మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో నిధులు జమ చేస్తున్నట్లు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రైతునేస్తం కార్యక్రమంలో ప్రకటించారు. నెలాఖరు నాటికి స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని అధికార, ప్రతిపక్ష పార్టీలు తమ క్యాడర్ను సన్నద్ధం చేస్తున్న సమయంలో రైతుభరోసా నిధులను మునుపటి కంటే పకడ్బందీగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు వెల్లడించడంతో ఎన్నిక స్టంటేనన్న చర్చలు స్థానికంగా వినిపిస్తున్నాయి.
మొదటిరోజు
రెండెకరాలలోపు వారికి..
జిల్లాలో 1,96,683 మంది రైతులు రైతుభరోసాకు అర్హులుగా జిల్లా వ్యవసాయశాఖ అధికారులు గుర్తించారు. వీరిలో రెండెకరాలలోపు వ్యవసాయ భూమి ఉన్న రైతులు 1,08,214 మంది ఉండగా.. మొదటిరోజు సోమవారం రూ.57,40,20,979 జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రైతు నేస్తం కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రెండెకరాలలోపు భూమి ఉన్న వారికి నిధులు జమ చేస్తూ మీట నొక్కారు. మిగతా రైతులందరికి తొమ్మిది రోజుల్లో సుమారు రూ. 155 కోట్లు జమ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
మండలాల వారీగా ఇలా..
మండలం అర్హులైన మంజూరైన
రైతులు నిధులు
వనపర్తి 20,083 15,71,41,940
పాన్గల్ 19,917 20,36,50,440
కొత్తకోట 18,536 17,13,93,636
ఖిల్లాఘనపురం 16,399 15,49,04,522
పెద్దమందడి 16,066 16,51,72,632
పెబ్బేరు 15,354 17,81,37,153
గోపాల్పేట 13,355 13,33,76,394
చిన్నంబావి 11,776 17,06,41,323
ఆత్మకూరు 11,585 17,13,93,636
మదనాపురం 10,227 11,28,48,975
ఏదుల 8,843 8,74,99,288
శ్రీరంగాపురం 8,241 8,09,73,330
అమరచింత 8,070 11,35,64,983
రేవల్లి 5,789 6,43,01,888
వీపనగండ్ల 2,442 17,85,98,920
జిల్లాలో తొలిరోజు
70 శాతం మంది రైతులకు..
అర్హులైన రైతులు 1.96 లక్షలు
మొదటిరోజు 1.08 లక్షల మంది ఖాతాల్లో రూ.57.40 కోట్ల
చెల్లింపులు
తొమ్మిది రోజుల్లో
పూర్తి చేసేలా ఆదేశాలు

అన్నదాతల ఆనందం

అన్నదాతల ఆనందం

అన్నదాతల ఆనందం

అన్నదాతల ఆనందం