
కానరాని పురోగతి
●
● విచారణలో జాప్యానికి తెలియని కారణాలు
● సీసీ కెమెరాలు వినియోగంలోకి వచ్చినట్లేనా?
● జిల్లా కార్యాలయాల్లో భద్రతపై వీడని సందేహాలు
నేటికీ తెలియలేదు..
ఏప్రిల్లో వరుసగా మూడురోజులు సెలవులు వచ్చిన సమయంలో మా కార్యాలయంలో కొత్త బ్యాటరీ చోరీ అయింది. పోలీసులకు ఫిర్యాదు చేసినా నేటికీ చోరీకి పాల్పడింది ఎవరనే విషయం తెలియరాలేదు. ప్రస్తుతం మా ఫ్లోర్లో సీసీ కెమెరాలు పని చేస్తున్నాయి. పోలీసుల విచారణ ఎంత వరకు వచ్చిందని అప్పుడప్పుడు అడుగుతున్నాం. – అఫ్జల్,
జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి, వనపర్తి
వనపర్తి: కలెక్టరేట్లోని రెండు జిల్లా కార్యాలయాల్లో బ్యాటరీలు మాయమైన ఘటన ఏప్రిల్ 16న వెలుగుచూసింది. చోరీ జరిగి రెండు నెలలు కావస్తున్నా.. ఎలాంటి పురోగతి కనిపించకపోవడం శోచనీయం. చోరీ ఘటనపై కలెక్టరేట్ ఏఓ, ఆయా శాఖల అధికారులు వనపర్తి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సమయంలో హడావుడి చేసిన పోలీసులు చోరీకి పాల్పడింది ఎవరనేది నేటికీ తేల్చలేదు. వందలాది మంది ఉద్యోగులు, ఫ్లోర్కు పదుల సంఖ్యలో సీసీ కెమెరాలు, గస్తీ నిర్వహించే సెక్యూరిటీ గార్డులు, సెలవు రోజుల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులున్న కలెక్టరేట్లో చోరీకి ఎలా ఆస్కారం ఉంటుందన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వనపర్తి రూరల్ ఎస్ఐ జలంధర్రెడ్డి పలు కోణాల్లో విచారణ చేపడుతున్నట్లు తెలుస్తున్నా.. పురోగతి మాత్రం కనిపించడం లేదు. కలెక్టరేట్లోని పలువురు సిబ్బందిని విచారణ చేయడంతో పాటు బయట ఎక్కడైనా విక్రయించారా అన్న కోణంలో జిల్లాకేంద్రంలోని పలు బ్యాటరీల దుకాణాల్లో విచారణ చేపట్టినా ఫలితం లేకపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
వరుస సెలవుల సమయంలోనే..
ఏప్రిల్ 16వ తేదీకి ముందు వరుసగా మూడురోజులు సెలవులు వచ్చిన సమయంలో భారీ బరువున్న బ్యాటరీని సైతం ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. మైనార్టీ సంక్షేమశాఖలో ఒకటి, జిల్లా పంచాయతీరాజ్శాఖ అధికారి కార్యాలయంలో రెండు బ్యాటరీలు మొత్తం మూడు చోరీ అయినట్లు కలెక్టరేట్ ఏఓ భానుప్రకాష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కొలిక్కిరాని కలెక్టరేట్ బ్యాటరీల చోరీ కేసు
సీసీ కెమెరాల నిర్వహణ లేక..
కలెక్టరేట్లోని ప్రధాన ద్వారం నుంచి ప్రతి ఎంట్రెన్స్, మలుపుల వద్ద, ప్రతి ఫ్లోర్లో హెచ్డీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కెమెరాల పర్యవేక్షణ, ఫుటేజీలను ఏఓ కార్యాలయం, కలెక్టర్ పేషీలో భద్రపర్చే ఏర్పాటు చేసినా.. చాలా వరకు పని చేయ లేదు. చోరీ ఘటన వెలుగుచూసిన కొన్ని గంటల్లోనే బాగు చేయించారు. చోరీకి సంబంధించిన సీసీ ఫుటేజీల కోసం పోలీసులు ఎంత ప్రయత్నించినా.. ఆధారాలు లభించకపోవడంతో కేసులో నేటికీ ఆశించిన పురోగతి కనిపించడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
విచారణ కొనసాగుతోంది..
కలెక్టరేట్లో బ్యాటరీల చోరీపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నాం. ఫిర్యాదు అందిన రోజుకంటే ముందు వరకు కలెక్టరేట్లో చాలా సీసీ కెమెరాలు పని చేయకపోవడంతో ఆధారాలు లభించడం లేదు. చోరీ చేసిన బ్యాటరీలను బయటకు తీయకపోవడంతో ఎక్కడా మార్కెట్లో విక్రయించినట్లు తెలియరాలేదు. త్వరలో కేసును ఛేదిస్తాం. – జలంధర్రెడ్డి, ఎస్ఐ, వనపర్తి రూరల్