
విద్వేషాలు, ఉద్రిక్తతలే మోదీ ఆయుధాలు
పాన్గల్: విద్వేషాలు, ఉద్రికత్తలే ప్రధాని మోదీ ఆయుధాలని, బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారిందని సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ ఆరోపించారు. మండలంలోని రేమద్దులలో రెండ్రోజుల పాటు జరిగిన సీపీఎం జిల్లాస్థాయి రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం ఆదివారం నిర్వహించగా.. ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. బీజేపీ పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని.. ఆపరేషన్ కగార్ పేరుతో విధ్యంసం సృష్టించేందుకు యత్నిస్తోందన్నారు. పాకిస్థాన్తో యుద్ధం ఆపి చర్చలు జరుపుతామంటున్న కేంద్రం.. దేశంలో మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పినా వినకుండా ఎన్కౌంటర్లు జరుపుతోందన్నారు. వెంటనే ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని.. అదేవిధంగా ఇజ్రాయిల్ మారణహోమ యుద్ధాన్ని తక్షణమే ఆపాలని, 19న పాలస్తీనా సంఘీభావ దినాన్ని జయప్రదం చేయాలని కార్యకర్తలకు సూచించారు. పోరాటాలతోనే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయని, ఇందుకు ప్రతి సభ్యుడు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని, కల్తీ విత్తనాలను అరికట్టి రాయితీపై రైతులకు ఎరువులు, విత్తనాలు అందించాలని, పెండింగ్లో ఉన్న బోనస్ చెల్లించాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తూనే పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ నిర్మాణం, పని పద్ధతులపై రెండ్రోజుల పాటు కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించామని పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండీ జబ్బార్ వివరించారు. ప్రజల పక్షాన ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు సంఘటితంగా పనిచేయాలని కోరారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు బాల్రెడ్డి, జి.వెంకటయ్య, మహబూబ్పాషా, ఆది, వేణుగోపాల్, దేవేందర్, వెంకటేష్, రాజేందర్గౌడ్, రాము, భగత్, ఎం.వెంకటయ్య, భాస్కర్, ఖాజా, మహేష్, మల్లేష్, శేఖర్, కమలాకర్, రాజు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.