
రామరాజ్యంతోనే ఆర్థిక పరిపుష్టి : బీజేపీ
వనపర్తిటౌన్: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిన దోపిడీ ప్రపంచంలో ఎక్కడా జరగలేదని బీజేపీ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ సినీ నిర్మాత గూడూరి నారాయణరెడ్డి ఆరోపించారు. ఆయన రజాకార్ల వారసుడని.. పదేళ్లలో రాష్ట్రంలో ఏమీ మిగల్చలేదని దుయ్యబట్టారు. సోమవారం జిల్లాకేంద్రంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నారాయణ ఆధ్వర్యంలో 11 ఏళ్ల మోదీ పాలనపై నిర్వహించిన ప్రదర్శనశాల, మేధావుల అవగాహన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించేందుకు రామరాజ్యం రావాలని ఆకాంక్షించారు. దేశం ఆర్థిక పరిపుష్టి సాధించాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ పని చేస్తున్నారని.. ఆర్థికంగా పదో స్థానంలో ఉన్న భారత్ను 4వ స్థానానికి తీసుకొచ్చారని కొనియాడారు. రూ.64 వేలు ఉన్న తలసరి ఆదాయాన్ని రూ.1.14 లక్షలకు చేర్చారని చెప్పారు. భావితరాలకు పునాది వేసేందుకు సనాతన ధర్మ పరిరక్షణే ఏకై క మార్గమన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన బీజేపీ రాష్ట్ర నాయకుడు అట్లూరి రామకృష్ణ మాట్లాడుతూ.. జవహర్లాల్ నెహ్రూ నుంచి మన్మోహన్సింగ్ వరకు కాంగ్రెస్ పాలనలో అన్నీ తప్పులే జరిగాయని, ప్రజా మద్దతుతోనే మోదీ మూడోసారి అధికారం చేపట్టారని తెలిపారు. యోగాను విశ్వవ్యాప్తం చేసిన ఘనత మోదీకే దక్కిందన్నారు. అనంతరం నారాయణరెడ్డి నిర్మించిన రజాకార్ల సినిమాకు గద్దర్ అవార్డు రావడంతో బీజేపీ జిల్లా నాయకులు గూడూరు నారాయణరెడ్డిని సన్మానించారు. రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సబిరెడ్డి వెంకట్రెడ్డి, అయ్యగారి ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు గౌని హేమారెడ్డి, మున్నూరు రవీందర్, ఫొటో ఎగ్జిబిషన్, ప్రొఫెషనల్ మీట్ కార్యక్రమాల కన్వీనర్, స ర్పంచ్ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు మెంటేపల్లి పురుషోత్తంరెడ్డి, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీశైలం పలువురు నాయకులు పాల్గొన్నారు.