
విధేయతకు తగిన గుర్తింపు
వనపర్తి: కాంగ్రెస్పార్టీలో విధేయతకు తగిన గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డా. జి.చిన్నారెడ్డి అన్నారు. టీపీసీసీ ప్రధానకార్యదర్శిగా జిల్లాకేంద్రానికి చెందిన నందిమళ్ల యాదయ్య ఎన్నిక కాగా.. ఆదివారం జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై యాదయ్యను శాలువాతో సన్మానించి మాట్లాడారు. జిల్లా కాంగ్రెస్ మత్స్యశాఖ సెల్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న యాదయ్యకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి గుర్తించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఏఐసీసీ సైతం మొదటి నుంచి పార్టీలో కష్టపడ్డ వారికే పదవులు ఇవ్వాలనే సంకల్పంతో పని చేస్తోందని గుర్తు చేశారు. కార్యకర్తలు పదవులు ఆశించి పని చేయవద్దని.. అంకితభావంతో పనిచేస్తే పదవులు కచ్చితంగా వరిస్తాయన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పార్టీ కోసం పనిచేసిన వారికే అవకాశం లభిస్తుందని తెలిపారు. కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి అధిష్టానం పని చేస్తోందని.. వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజా ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ 65 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి ఆసరాగా నిలబడ్డామని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని.. దేశంలో కులగణన చేసిన ఏకై క రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని వెల్లడించారు. పార్టీ బలోపేతానికి అంకితభావంతో పని చేస్తానని నందిమళ్ల యాదయ్య తెలిపారు. సామాజిక న్యాయం కాంగ్రెస్పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ఆదిత్యారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ యాదవ్, ప్రధానకార్యదర్శి చీర్ల జనార్దన్, వనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీపీ శంకర్నాయక్, రాష్ట్ర నాయకురాలు ధనలక్ష్మి, రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి కమర్మియా, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు సమద్మియా, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.