
ఆర్థిక చేయూత
చేనేత..
రూ.లక్ష రుణమాఫీకి ప్రభుత్వం నిర్ణయం
●
రూ.50 వేలు అప్పు తీసుకున్నా..
నాలుగేళ్ల కిందట చేనేత వస్త్రాల ఉత్పత్తి కోసం బ్యాంకు నుంచి రూ.50 వేలు రుణం తీసుకున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని ప్రకటించడంతో సంతోష కలిగింది. ఏడాది నుంచి రుణమాఫీ ఎప్పుడు వర్తిస్తుందా అని ఎదురుచూస్తున్నా.
– స్వాతి, నేత కార్మికురాలు, గద్వాల
మగ్గాల కొనుగోలుకు..
కొత్త మగ్గాల కొనుగోలుకు డబ్బులు అవసరం ఉండి బ్యాంకు నుంచి రూ.లక్ష రుణం తీసుకున్నా. క్రమం తప్పకుండా ప్రతిసారి రెన్యూవల్ చేశా. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేస్తామనడంతో తీసుకున్న డబ్బులు మాఫీ అవుతాయనే సంతోషం ఉంది.
– పుట్టా సరిత, నేత కార్మికురాలు, గద్వాల
రుణ వివరాలు అందించాం..
చేనేత సహకార సంఘం ద్వారా బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న కార్మికుల వివరాలను జౌళిశాఖ అధికారులకు అందించాం. 2017 సంవత్సరంలో ముద్ర లోన్తో పాటు క్రెడిట్ కార్డు ద్వారా నేత కార్మికులకు రుణాలు ఇప్పించాం. ఇన్నేళ్లకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం సంతోషం.
– చంద్రమోహన్,
అధ్యక్షుడు, చేనేత సహకార సంఘం
అందరికీ వర్తింపజేయాలి..
చేనేత కార్మికులు బ్యాంకు ద్వారా తీసుకున్న రుణాలన్నీ మాఫీ చేసి విముక్తి కల్పించాలి. ముద్ర, క్రెడిట్ కార్డులతో పాటు వ్యక్తిగతంగా తీసుకున్న రుణాలను పరిగణలోకి తీసుకోవాలి. రూ.లక్షలోపు రుణాలు పొందిన వారి జాబితాను తయారుచేసి త్వరగా మాఫీ వర్తింపజేయాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలి. – అక్కల శాంతారం,
జిల్లా కార్యదర్శి,
చేనేత కార్మికుల సంఘం, గద్వాల
అమరచింత: చేనేత కార్మికుల రుణాలు మాఫీ చేస్తామని గతేడాది సెప్టెంబర్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించగా.. ఇందుకు సంబంధించి తాజాగా జిల్లా అధికారులకు మార్గదర్శకాలు అందాయి. 2017, ఏప్రిల్ నుంచి 2024, మార్చి వరకు నేత కార్మికులు బ్యాంకుల్లో తీసుకున్న రుణాలు మాఫీ కానున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని చేనేత కార్మికులకు ఆర్థిక ఊరట లభించినట్లయింది. ప్రభుత్వ ఆదేశాలతో మహబూబ్నగర్, జోగుళాంబ గద్వాల ఏడీ కార్యాలయాల పరిధిలో నేత కార్మికులు ఎంతమంది రూ.లక్ష రుణాలు తీసుకున్నారనే వివరాలను బ్యాంకు మేనేజర్లతో సేకరించి జాబితా రూపొందిస్తున్నారు. ఆ జాబితాను మరోమారు పరిశీలించి కలెక్టర్ల ఆధ్వర్యంలో డీఎల్సీ (జిల్లాస్థాయి కమిటీ) ఏర్పాటు చేసి స్టేట్ లెవల్ కమిటీకి నివేదించనున్నారు.
రూ.6.50 కోట్లకుపైగా రుణాలు..
ఉమ్మడి జిల్లాలో 4,537 జియోట్యాగ్ కలిగిన మగ్గాలు ఉండగా.. 8,338 మంది కార్మికులు నేత పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మగ్గం పనిచేసే కార్మికులు ముద్ర యోజన, క్యాష్ క్రెడిట్, చేనేత మగ్గాల పేరున రుణాలు పొందారు. ఇలా చేనేతకు సంబంధించి సుమారు రూ.6.50 కోట్లకుపైగా రుణాలు తీసుకున్నట్లు గతంలో అధికారులు సేకరించిన లెక్కల ప్రకారం తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో కార్మికుడికి రూ.లక్ష రుణం మాఫీ చేస్తామని ప్రకటించడం, ఇందుకు సంబంధించిన విధి విధానాలు ఆయా జిల్లాల ఏడీలకు అందడంతో ప్రక్రియ వేగవంతంగా ముందుకు సాగుతోంది.
వేగంగా కొనసాగుతున్న ప్రక్రియ..
చేనేత కార్మికుల రుణమాఫీకి సంబంధించిన వివరాలను ఆయా చేనేత సహకార సంఘాల ద్వారా ఇదివరకే సేకరించిన జౌళిశాఖ అధికారులు తాజాగా మరోమారు ఏ బ్యాంకులో రుణాలు ఇప్పించారో అక్కడికే వెళ్లి రుణగ్రహీతల వివరాలు ఇవ్వాలని కోరుతున్నారు. రూ.30 వేలు, రూ.50 వేలు, రూ.లక్షలోపు రుణాలు తీసుకున్న వారి వివరాలను సైతం సదరు ఏడీ కార్యాలయాల సిబ్బంది సేకరించే పనుల్లో లీనమయ్యారు. రెండు, మూడు రోజుల్లో జౌళిశాఖకు పూర్తి నివేదిక అందనుంది. వీటిని రాష్ట్రస్థాయి కమిటీకి అందజేసిన తర్వాత ప్రభుత్వం అర్హుల జాబితాను ప్రకటించనుంది.
ఇవీ మార్గదర్శకాలు..
కలెక్టర్ చైర్మన్గా ఆరుగురితో కూడిన జిల్లాస్థాయి కమిటీ (డీఎల్సీ) ఆమోదం పొందాలి. తర్వాత చేనేత డైరెక్టర్ చైర్మన్గా ఉన్న స్టేట్ లేవల్ కమిటీ ఆమోదం పొందితే బ్యాంకర్లు నో డ్యూ సర్టిఫికేట్ జారీ చేస్తారు.
ప్రతి కార్మికుడికి వడ్డీతో కలిపి రూ.లక్ష వరకు రుణ మాఫీ అవుతుంది. అంతకుమించి ఉన్న మొత్తాన్ని తిరిగి చెల్లిస్తేనే రుణమాఫీ వర్తిస్తుంది.
ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా తీసుకున్న రుణాలకే మాఫీ వర్తిస్తుంది.
ఉమ్మడి జిల్లాలో 8,338 కార్మికులు.. 4,537 జియోట్యాగింగ్ మగ్గాలు
రూ.6.50 కోట్ల అంచనా
బ్యాంకర్లను నివేదిక కోరిన
అధికారులు
వివరాలు సేకరిస్తున్నాం..
చేనేత కార్మికులు 2017 నుంచి 2024 వరకు బ్యాంకుల్లో రూ.లక్షలోపు రుణం పొందిన కార్మికుల వివరాలను బ్యాంకు మేనేజర్లతో తీసుకుంటున్నాం. ప్రభుత్వం రూపొందించిన విధివిధానాలతో రుణమాఫీ వర్తించే వారి జాబితాను రూపొందించి రాష్ట్రస్థాయి కమిటీకి నివేదించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం.
– గోవిందయ్య, ఏడీ, చేనేత, జౌళిశాఖ, గద్వాల

ఆర్థిక చేయూత

ఆర్థిక చేయూత

ఆర్థిక చేయూత

ఆర్థిక చేయూత

ఆర్థిక చేయూత