
రిజర్వాయర్ నిర్మాణానికి సహకరించండి
ఖిల్లాఘనపురం: గణపసముద్రం రిజర్వాయర్ నిర్మాణానికి రైతులు పెద్ద మనసుతో సహకరించాలని ఆర్డీఓ సుబ్రమణ్యం కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతువేదికలో రిజర్వాయర్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. రిజర్వాయర్ నిర్మాణానికి మొత్తం 603.46 ఎకరాలు అవసరం ఉండగా.. అందులో 388 ఎకరాలు చెరువు లోపల శిఖం పట్టాలున్నాయని వివరించారు. మొత్తం 991 మంది రైతులకు పట్టాలు ఉండగా.. ఇప్పటికే 251 మంది రైతులు భూమిని అప్పగించడానికి అంగీకారం తెలపడంతో పాటు అవార్డు అందజేసినట్లు తెలిపారు. మిగతా 740 మంది రైతులు అంగీకారం తెలిపి అవార్డు చేసుకుంటే రిజర్వాయర్ నిర్మాణం పూర్తయి మండలంతో పాటు మూసాపేట మండలంలోని ముసాపేట, నిజాలాపూర్, మహ్మద్హుస్సేన్పల్లి తదితర గ్రామాల్లోని 5,200 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. భూ నిర్వాసితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.11 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు పరిహారం అందుతుందని చెప్పారు. 15 రోజుల సమయం తీసుకొని అన్నివిధాలుగా ఆలోచించి అంగీకారం తెలపాలని కోరగా.. రైతులు అందుకు సమ్మతించారు. సమావేశంలో ఇరిగేషన్ డీఈ నరేందర్రెడ్డి, ఏఈ వెంకటేశ్వర్లు, సర్వేయర్, రైతులు పాల్గొన్నారు.
రెవెన్యూ సదస్సులు వినియోగించుకోండి..
తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను భూ సమస్యలున్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీఓ సుబ్రమణ్యం కోరారు. శుక్రవారం మండల పరిధిలోని అప్పారెడ్డిపల్లిలో కొనసాగిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరైన ఆయన రైతులు ఇచ్చిన ధరఖాస్తుల ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను పరిష్కరించేందుకు ఈ సదస్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. గ్రామాలకు వచ్చే అధికారులకు సమస్యలు ఉన్న రైతులు ధరఖాస్తులు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సుగుణ, ఆర్ఐ తిర్పతయ్య, కార్యాలయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.