
భూ సమస్యల పరిష్కారానికే భూ భారతి
కొత్తకోట రూరల్: రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని 19 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన తర్వాతే భూ భారతిని రూపొందించి అమలు చేస్తోందని.. భూ సమస్యల పరిష్కారానికే ఈ చట్టం తీసుకొచ్చామని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మిరాసిపల్లిలో జరిగిన రెవెన్యూ సదస్సుకు ఆయన హాజరై రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకొని వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో భూ సమస్యలు పరిష్కరించుకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ధరణి పేరుతో రైతులను దగా చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు కొనసాగించడంతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. అంతేగాకుండా ధనవంతులతో సమానంగా సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని.. దేశంలో ఎక్కడా లేదని, ఈ ఘనత సీఎం రేవంత్రెడ్డికే దక్కిందని తెలిపారు. గ్రామానికి మొదటి విడత 24 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా.. రెండోవిడతలోనూ మంజూరు చేస్తామన్నారు. అంతకుముందు గ్రామంలో పెండింగ్లో ఉన్న వడ్డెర, యాదవ కమ్యూనిటీ హాల్స్, సీసీ రోడ్ల నిర్మాణాలకు, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు బాలమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ పి.ప్రశాంత్, బీచుపల్లియాదవ్, కాంగ్రెస్ నాయకులు రావుల కరుణాకర్రెడ్డి, మాజీ సర్పంచ్ శేఖర్రెడ్డి, సాయిరెడ్డి పాల్గొన్నారు.
పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్స్ అందజేత..
గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాఠ్య, రాత పుస్తకాలు, యూనిఫామ్స్ను ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్కు ధీటుగా సౌకర్యాలు, బోధన అందుతుందని.. ఉపాధ్యాయులు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు గ్రామాల్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీహెచ్ఎస్ హెచ్ఎం శ్రీనివాస్రెడ్డి, పీఎస్ హెచ్ఎం భీంపల్లి బాలరాజు, ఉపాధ్యాయులు సత్యనారాయణ, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.