శృంగవరపుకోట: పట్టణంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఘరానా చోరీ పట్టణ వాసులను ఉలిక్కిపడేలా చేసింది. ప్రధాన రహదారిలో జనం తిరిగే సమయంలో షాపులకు ఉన్న షట్టర్లు తెరిచి దర్జాగా చోరీ చేసి నిందితుడు పరారయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్.కోట ప్రధాన రహదారిలో ఉన్న సీతారామ మెడికల్స్ దుకాణంలో చోరీకి యత్నం చేసి షట్టర్ బలంగా ఉండడంతో ప్రయత్నం విరమించుకుని పైన మేడపైన ఉన్న డాక్టర్ సీతారత్నంకు చెందిన సీతారామ మెడికల్ ల్యాబ్లో చోరీకి పాల్పడ్డాడు. ల్యాబ్లో రూ.4వేలు చోరీ చేసినట్టు డాక్టర్ సీతారత్నం పోలీసులకు తెలిపారు. తరువాత తెల్లవారుజామున మూడు గంటల సమయంలో ప్రధాన రహదారిలో ఉన్న జైశ్రీరామ మెడికల్స్ దుకాణంలో చోరీకి పాల్పడ్డాడు. ఈ దుకాణంలో ఎక్కువ మొత్తంలో సొమ్ము చోరీకి గురైనట్టు ఫిర్యాదుదారు తెలిపారు. విజయనగరం నుంచి వచ్చిన క్లూస్ టీం సభ్యులు ఆధారాలు సేకరించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రధాన రహదారిలో ఉన్న పలు దుకాణాలు, మాల్స్ నుంచి సీసీ పుటేజీలను పరిశీలించారు. చోరీకి పాల్పడింది ఒకే వ్యక్తి అని నిర్దారణకు వచ్చారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ నారాయణమూర్తి తెలిపారు.


