విలువలతో కూడిన విద్యను బోధించాలి
నెల్లిమర్ల: వైద్య విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను బోధించాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. నెల్లిమర్ల పట్టణంలో ఉన్న మిమ్స్ కళాశాలను బుధవారం ఆయన సందర్శించారు. కళాశాల అధ్యాపకులు, విద్యార్థులతో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. అధ్యాపకులతో పాటు సిబ్బందికి తప్పనిసరిగా సీపీఆర్పై పూర్తి అవగాహన ఉండాలన్నారు. పరిపాలనలో సలహాలు, సూచనలు అందించాలని వీసీ సూచించారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నూతన కార్యాలయం అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. త్వరలోనే 25 ఎకరాల్లో యూనివర్సిటీకి నూతన భవనాలు నిర్మిస్తామని తెలిపారు. సదరు కార్యాలయంలో వైద్య విద్యకు అవసరమైన పరిశోధనకు ప్రాధాన్యమిస్తామన్నారు. ప్రతి కళాశాలలో కృత్రిమ మేధ(ఏఐ)కు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కర్నూలు, విజయవాడ ప్రభుత్వ మెడికల్ కళాశాలల్లో ఏఐ కోర్సులను ప్రాథమికంగా అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. వైద్య వృత్తిలో కొనసాగుతున్న అధ్యాపకులకు క్రమశిక్షణ అవసరమన్నారు. పరీక్షల నిర్వహణలో త్వరలోనే మార్పులు తీసుకొస్తామని పేర్కొన్నారు. జూలై 1వ తేదీన డాక్టర్స్ డే నిర్వహిస్తున్నామని, ఉత్తమ అధ్యాపకులకు అవార్డులు అందజేస్తామని తెలిపారు.
మిమ్స్ న్యూస్ లెటర్ ఆవిష్కరణ...
కళాశాలకు చెందిన మిమ్స్ కనెక్ట్ న్యూస్ లెటర్ను వీసీ చంద్రశేఖర్ ఆవిష్కరించారు. కళాశాల సమాచారాన్ని అధ్యాపకులకు, విద్యార్థులకు తెలియజేసే ఉద్దేశంతో న్యూస్ లెటర్ను ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. కళాశాలలో పూర్తిస్థాయిలో అధ్యాపకులు, సిబ్బందిని నియమించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కళాశాలలో తరగతులు, పరీక్షల నిర్వహణలో అవలంభిస్తున్న విధానాలను డీన్ వివరించారు. కార్యక్రమంలో మెడికల్ డైరెక్టర్, ఆస్పత్రి సూపరింటెండెంట్, తదితరులు పాల్గొన్నారు.


