వైద్య కళాశాల పోస్టుల భర్తీపై నీలినీడలు
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఖాళీ పోస్టుల భర్తీపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి 14 నెలలవుతున్నా ఇంతవరకు భర్తీ పక్రియ పూర్తికాకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన నెల, రెండు నెలల్లో పోస్టులు భర్తీ చేస్తారు. కానీ చంద్రబాబు సర్కార్ పాలనలో ఏడాది దాటినా పోస్టుల భర్తీ పక్రియ పూర్తి కాకపోవడం గమనార్హం. దీంతో దరఖాస్తు చేసిన అభ్యర్థులు అయోమయ స్థితిలో కొట్టుమిట్టుడుతున్నారు.
2024 డిసెంబర్లో నోటిఫికేషన్
2024 డిసెంబర్ నెలలో ప్రభుత్వ వైద్య కళాశాల, సర్వజన ఆస్పత్రుల్లో ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసే సిబ్బందికి కొద్ది రోజుల క్రితం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. కానీ ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు ఎంపికై న అభ్యర్థులకు మాత్రం అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు.
మేం అనుమతి ఇచ్చే వరకు
అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వొద్దు
ఔట్ సోర్సింగ్ విభాగంలో పనిచేసే సిబ్బందికి సంబంధించి మేము అనుమతి ఇచ్చే వరకు అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవొద్దుని వైద్య కళాశాల అధికారులకు అప్కోస్ అధికారులు లెటర్ పంపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నియామక పక్రియ పూర్తయినప్పటికీ చంద్రబాబు సర్కార్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వకుండా కొర్రీ వేయడం పట్ల ఎంపికై న అభ్యర్థులు మండిపడుతున్నారు. నోటిఫికేషన్ ఇచ్చి 14 నెలలైంది. ఇప్పటికే నియామక పక్రియ పూర్తయింది. ఇప్పుడు మళ్లీ అపాయింట్ మెంట్ ఆర్డర్స్ జాప్యం చేయడం పట్ల అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సకాలంలో
అపాయింట్మెంట్ ఆర్డర్స్
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు చేపట్టింది. జీరో వెకేన్సీ పాలసీ తీసుకొచ్చి పోస్టులను ఎప్పటకిప్పుడు భర్తీ చేసింది. నోటిఫికేషన్ ఇచ్చిన నెలరోజుల లోపే పోస్టుల భర్తీచేసేవారు. జిల్లాలో 2 వేలకు పైగా పోస్టులను భర్తీ చేశారు. నియామక పక్రియ పూర్తయిన వెంటనే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి విధుల్లోకి తీసుకునే వారు. చంద్రబాబు ప్రభుత్వంలో అందుకు విరుద్ధమైన పరిస్థితి. నియామక పక్రియ పూర్తి అయినప్పటికీ అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది.
నోటిఫికేషన్ ఇచ్చి 14 నెలలైనా భర్తీ కాని పరిస్థితి
ఓపెన్ కానీ అప్కోస్ వెబ్సైట్
అప్కోస్ను ఎత్తేసే అలోచనలో టీడీపీ సర్కార్
అయోమయ స్థితిలో అభ్యర్థులు
49 మంది ఎంపిక
ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేసేందుకు 49 మందిని ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు ఎంపిక చేశారు. వారిలో 25 మంది జూనియర్ అసిస్టెంట్స్, 17 మంది జీడీఏ(జనరల్ డ్యూటీ అటెండర్స్), ఇద్దరు హెల్పర్, ఇద్దరు స్టోర్ అటెండర్స్, 3 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు ఎంపికయ్యారు. అయితే వారికి నియామక పక్రియ పూర్తయినప్పటికీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ మాత్రం ఇవ్వలేదు.
అప్కోస్ను ఎత్తే వేసే అలోచనలో సర్కారు
అప్కోస్ను ఎత్తేవేసే అలోచనలో టీడీపీ సర్కార్ ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగా అప్కోస్ వెబ్సైట్ను నాలుగు నెలలుగా మూసేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతులన్నాయి. అప్కోస్ను ఎత్తేసి దాని స్థానంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మాదిరి ఏజెన్సీలకు ఇచ్చే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనుయాయులకు ఏజెన్సీలను కట్టబెట్టడం ద్వారా వారికి లబ్ధి చేకూర్చాలని చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


