రెండు వారాల్లో చోరీ కేసు ఛేదించిన పోలీసులు
విజయనగరం క్రైమ్: జైల్లో పరిచయం అయ్యింది. వారిద్దరూ స్నేహితులయ్యారు. ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటూ బయటకొచ్చి ఆ స్నేహానికి చెడు వ్యసనాలు తోడవడంతో చేతిలో డబ్బులు అవసరం కావడంతో దొంగతనాన్ని మార్గంగా ఎంచుకున్నారు. మెదడులో వచ్చిన ఆలోచనలతో చేతలకు పని చెప్పారు. ఏకంగా 38 సవర్ల బంగారం,30 తులాల వెండి ఆభరణాలు అపహరించారు. చోరీ జరిగిన 12 రోజుల్లోనే పోలీసులు కేసును ఛేదించారు.ఈ మేరకు విజయనగరంలోని కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం ఎస్పీ దామోదర్ ఆ కేసు వివరాలను వెల్లంచారు. వివరాల్లోకి వెళితే జానపురెడ్డి వెంకటరమణ భార్యతో కలిసి వేపాడలోని బొద్దాంలో ఉంటున్నాడు. ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించారు.భద్రత నిమిత్తం పిల్లల ఆభరణాలను కన్న వారింట్లోనే ఉంచారు. ఈ నెల ఒకటవ తేదీన వెంకటరమణ భార్యతో కలిసి పొలం పనుల నిమిత్తం ఇంటికి తాళం వేసి వెళ్లారు.మధ్యాహ్నం ఇంటికొచ్చి చూసేసరికి తాళం తీసి ఉండడం, ఇంట్లోని బీరువాలో ఉండే బంగారం, వెండి అభరణాలు కనిపించక పోవడంతో వెంటనే వల్లంపూడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి పన్నెండు రోజుల్లో అనకాపల్లి జిల్లా మాడుగలకు చెందిన పిల్లా నూకరాజు,పెచేటి ఉపేంద్రలను పట్టుకున్నారు.ఇద్దరి నుంచి 38సవర్ల బంగారం,30 తులాల వెండి స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డీఎస్పీ గోవిందరావు, ఎస్.కోట రూరల్ సీఐ అప్పలనాయుడు, వల్లంపూడి ఎస్సై సుదర్శన్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


