పరిహారం చెల్లించకుండా పనులెలా చేస్తారు?
● జీఎంఆర్ సంస్థ చేపట్టిన పనులను అడ్డుకున్న తూడెం గ్రామస్తులు
భోగాపురం: తాత ముత్తాతల నుంచి సాగుచేస్తున్న భూములకు పరిహారం చెల్లించకుండా.. కనీసం సమాచారం ఇవ్వకుండా చదునుచేసే పనులు ఎలా చేపడతారంటూ భోగాపురం మండలం బసవపాలెం రెవెన్యూ పరిధిలోని తూడెం గ్రామస్తులు ఆందోళన వ్యక్తంచేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్కు సదుపాయాల కల్పనలో భాగంగా జీఎంఆర్ సంస్థ బుధవారం చేపట్టిన భూమి చదును పనులను అడ్డుకున్నారు. జేసీబీ ముందునిల్చొని నిరసన తెలిపారు. పరిస్థితిని గమనించిన జీఎంఆర్ సంస్థ ప్రతినిధులు తహసీల్దార్తో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పి అక్కడి నుంచి వెనుదిరిగారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని గ్రామస్తులు స్పష్టం చేశారు.


