లబ్ధిదారులను భయపెట్టండి
● ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు మండల
ప్రత్యేకాధికారి ఆదేశం
● ఇళ్ల లక్ష్యం నెరవేరడమే ప్రధానం
బాడంగి:
ఇళ్ల లబ్ధిదారులను భయపెట్టి 101 ఇళ్ల లక్ష్యం ఉగాదినాటికి పూర్తిచేయాలని మండలప్రత్యేకాధి కారి ఎం.కిరణ్కుమార్ ఇంజినీరింగ్ సహాయకులను ఆదేశించారు. బాడంగి మండల పరిషత్ కార్యాలయంలో ఈఏలతో మంగళవారం హౌసింగ్ ప్రగతిపై సమీక్షించారు. గృహప్రవేశాల్లో ప్రగతి లేదని అసహనం వ్యక్తంచేశారు. లబ్ధిదారులను ఏవిధంగా భయపెడితే వింటారో చెప్పాలని ఈఏలను సలహా అడిగారు. అందుకు కొంతమంది జగనన్నకాలనీలో ఇచ్చిన పట్టాలు రద్దుచేస్తారని, తిరిగి తీసుకుంటారని, ఇల్లు కట్టకపోతే వేరేవారికి బదిలీ చేస్తారని, రేషన్ కార్డులు రద్దుచేస్తామని భయపెడితే తప్పకదారికొస్తారని చెప్పగా ఆ విధానం పాటించాలంటూ సూచించారు. ఈ సూచనపై అక్కడ ఉన్న కొందరు ఉద్యోగులు ఇదేం తీరు అంటూ గుసగుసలాడారు. సమీక్ష సమావేశంలో ఏఓ శ్రీలక్ష్మి, ఏపీఎం రత్నకుమార్, ఏపీఓ సాయిబాబా, హౌసింగ్ సిబ్బంది, ఈఏలు పాల్గొన్నారు.


