అన్నదమ్ముల మధ్య కొట్లాట
● ఇద్దరికి తీవ్ర గాయాలు
లక్కవరపుకోట: మండలంలోని చందులూరు గ్రామంలో చింతచెట్టు విషయమై మంగళవారం ఇద్దరు అన్నదమ్ముల మధ్య చెలరేగిన వివాదం కొట్లాటకు దారితీసింది. కిలపర్తి దేముడు తన కుమారుడితో కలిసి చింతచెట్టును నరికేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఎర్రినాయుడు ఆయన కుమారుడు సింహాచలం అడ్డుకున్నారు. దీంతో వివాదం రేగి నలుగురూ తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ క్రమంలో ఎర్నాయుడికి, దేముడు కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికుల సహాయంతో వారిద్దరినీ ఎస్.కోట సీహెచ్కి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విశాఖపట్నం తరలించినట్లు ఎస్సై నవీన్పడాల్ తెలిపారు. ఈ మేరకు ఇరువర్గాలు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
ముగ్గురికి గాయాలు
గుర్ల: మండలంలోని గూడెం జంక్షన్ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారని ఎస్సై నారాయణ రావు మంగళవారం తెలిపారు. చీపురుపల్లికి చెందిన నవీన్, ధనుంజయ్ ద్విచక్ర వాహనంపై విజయనగం నుంచి చీపురుపల్లి వస్తుండగా గుజ్జింగివలసకు చెందిన ఆవాల రమణ ద్విచక్ర వాహనంపై గుర్ల వెళ్తుండగా రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం విజయనగరంలోని మహరాజా ఆస్పత్రికి తరలించారు. గుర్ల ఎస్సై నారాయణరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ వృద్ధురాలి మృతి
గజపతినగరం రూరల్: అగ్ని ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మండలంలోని కొత్త బగ్గాం గ్రామానికి చెందిన వృద్ధురాలు బగ్గాం శ్యామల (75 ) మంగళవారం మృతి చెందింది. దీనిపై ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు తెలిపిన వివరాల ప్రకారం, గత నెల 25వ తేదీన వృద్ధురాలు బగ్గాం శ్యామల ఉదయం 10 గంటల సమయంలో తన ఇంటి ముందు గల తులసి చెట్టు వద్ద దీపం వెలిగించి, ప్రదక్షిణ చేస్తుండగా ఆమె చీరకు నిప్పంటుకుంది. దీంతో కాలిన గాయాలతో విజయనగరంలోని సర్వజన ఆస్పత్రిలో కుటుంబసభ్యులు ఆమెను చేర్పించారు. కొద్ది రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె మృతిచెందడంతో కుమారుడు బగ్గాం పూర్ణచంద్రరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు.
అన్నదమ్ముల మధ్య కొట్లాట


