బైక్ను ఆటో ఢీకొని వ్యక్తి మృతి
రాజాం సిటీ: మండల పరిధి పొగిరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జి.సిగడాం మండలం సంతవురిటికి చెందిన ప్రమిదల శ్రీనివాసరావు (56) ఆదివారం మృతిచెందాడు. ఈ ఘటనపై స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శ్రీనివాసరావు తన కుమార్తె కన్యసికతో కలిసి ద్విచక్రవాహనంపై రాజాం వచ్చి స్వగ్రామం తిరుగు ప్రయాణమయ్యాడు. పొగిరి వద్దకు వచ్చేసరికి ఎదురుగా వస్తున్న ఆటో ముందున్న లారీని తప్పించబోయి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో రోడ్డుపై పడిన ఇద్దరూ గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు స్పందించి క్షతగాత్రులను రాజాంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రమాదంలో కాలికి గాయమైన కుమార్తె చికిత్స పొందగా, తీవ్రంగా గాయపడిన శ్రీనివాసరావు చికిత్సపొందుతూ మృతిచెందాడని పోలీసులు తెలిపారు. ఆయనకు భార్య ఉమాపార్వతి, మరో ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఉమావెంకటేశ్వరరావు తెలిపారు.


