9న ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎమ్డీ’
విజయనగరం రూరల్: విద్యుత్ సమస్యలు పరిష్కారానికి ఈ నెల 9వ తేదీన ‘డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎమ్డీ’ కార్యక్రమానికి శ్రీకారం చుడతామని సీఎమ్డీ పృధ్వీతేజ్ ఇమ్మడి తెలిపారని విజయనగరం ఎస్ఈ మువ్వల లక్ష్మణరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ సంబంధిత సమస్యలను మరింత వేగవంతంగా పరిష్కరించాలన్నదే దీని ప్రధాన ఉద్దేశమన్నారు. ఉత్తరాంధ్ర విద్యుత్ వినియోగదారులు ఫోన్ నంబర్ 86884 00499కు ఫోన్చేసి విద్యుత్ సమస్యలు తెలియజేయవచ్చన్నారు. డయల్యువర్ సీఎమ్డీ కార్యక్రమాన్ని విశాఖపట్నం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు నిర్వహిస్తారన్నారు.
ఏపీపీఎస్సీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
విజయనగరం కలెక్టరేట్: అటవీశాఖలో నాలుగు, దేవదాయశాఖలో ఒక పోస్టు భర్తీకి ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న పరీక్షలకు ఏర్పాట్లు పూర్తిచేశామని డీఆర్వో నూకరాజు తెలిపారు. పరీక్షలకు 6,700 మంది హాజరవుతున్నారని, విజయనగరం సమీపంలో జేఎన్టీయూ, సీతం కాలేజీల్లో పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
రెవెన్యూ లీలలు.. కూటమి మాయలు
● ఐదేళ్ల కిందట చనిపోయిన వ్యక్తి పేరుతో పాస్పుస్తకం
రాజాం/సంతకవిటి: గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భూముల రీసర్వే చేపట్టింది. ఎన్నోఏళ్లుగా రైతులను వెంటాడుతున్న భూ సమస్యలకు పరిష్కారం చూపింది. ఈ సర్వేను వక్రీకరించిన కూటమి ప్రభుత్వం... అధికారంలోకి వచ్చిన తరువాత గత సర్వేలో జరిగిన తప్పులు సరిదిద్దుతున్నామంటూ తప్పులతడకలతో కూడిన పాసుపుస్తకాలను అందజేస్తోంది. దీనికి సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన గార అసిరినాయుడుకు అందజేసిన పాస్పుస్తకమే నిలువెత్తు నిదర్శనం. ఆయన కుటుంబానికి మందరాడలో 47 సెంట్లు భూమి ఉంది. తన తల్లి సత్తెమ్మ పేరుమీద ఉండేది. ఆమె ఐదేళ్ల కిందట మృతిచెందింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన రీ సర్వేలో భూ హక్కుపత్రం ఆయన పేరుకు మారింది. ఒన్బీ రావడంతో సంతోషపడ్డారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా మళ్లీ ఆయన తల్లి సత్తెమ్మపేరుతో పాస్పుస్తకం ఇవ్వడంతో సమస్య మొదటికొచ్చిందంటూ గగ్గోలు పెడుతున్నారు. గ్రామ సచివాలయానికి వెళ్లి వీఆర్వో సత్యనారాయణను కలిస్తే మళ్లీ భూ సర్వేకు, రీ మ్యుటేషన్కి పెట్టమంటున్నారంటూ ఆయన వాపోయారు.
ఐరోపా పర్యటనకు మన్యం మహిళ
పార్వతీపురం రూరల్: ప్రకృతి వ్యవసాయంలో విశేష అనుభవం గడించిన పార్వతీపురం మన్యం జిల్లా దురుబిలి గ్రామానికి చెందిన ఆరిక నరసమ్మ అంతర్జాతీయ అధ్యయన పర్యటనకు ఎంపికయ్యారు. శనివారం ఆమెను కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకర రెడ్డి అభినందించారు. బెర్లిన్లోని ‘ఫౌండేషన్ ఆన్ ఫ్యూచర్ ఫార్మింగ్’ సంస్థ ఆధ్వర్యంలో ఐరోపాలోని ఏడు దేశాల్లో 30 రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికై న 611 మంది రైతు శాస్త్రవేత్తలు, 350 మంది మెంటర్లలో జిల్లా నుంచి నరసమ్మకు చోటు లభించింది. పర్యటనలో భాగంగా 2,000 చదరపు మీటర్ల గ్లోబల్ ఫీల్డ్ మోడల్, వివిధ దేశాల్లోని సేంద్రియ వ్యవసాయ క్షేత్రాలు, పరిశోధనా సంస్థలను సందర్శించడంతో పాటు అక్కడి విధాన నిర్ణేతలతో చర్చల్లో ఆమె పాల్గొననున్నారు.


