ఉత్సాహంగా పారా అథ్లెటిక్స్ జిల్లా స్థాయి పోటీలు
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న పారా అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొనబోయే జిల్లా క్రీడాకారుల ఎంపిక పోటీలు ఆదివారం ముగిశాయి. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సహకారంతో పారా (దివ్యాంగుల) అథ్లెటిక్స్ జిల్లాస్థాయి పోటీలు స్థానిక రాజీవ్ క్రీడామైదానంలో నిర్వహించారు. ఈ పోటీలకు ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు మానసిక, శారీరక ఆరోగ్యానికి ఎంతగానో దోహదపడతాయన్నారు. అనంతరం పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు ఆయన అభినందనలు తెలిపారు. పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె. దయానంద్ మాట్లాడుతూ ప్రధానంగా రన్నింగ్, షాట్పుట్, లాంగ్జంప్, డిస్క్ త్రో, జావెలిన్ త్రో పోటీలు నిర్వహిస్తున్నామని, ఈనెల 27 న నెల్లూరులో జరగబోయే 8 వ రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్ పోటీల ఎంపికల కోసం ఈ జిల్లా స్థాయి పోటీలను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని, రాష్ట్రస్థాయిలో విజేతలను ఫిబ్రవరిలో ఒడిశా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్తో పాటు, వైస్ ప్రెసిడెంట్ పి.కల్యాణి, జాయింట్ సెక్రటరీ కె.లక్ష్మి, శ్రీకాకుళం అధ్యక్షుడు రాము, ట్రెజరర్ స్రవంతి, కోచ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు.


