మహారాణిపేట: విశాఖ నగరంలో ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆరోపించారు. ప్రజలు ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి సమస్యలు చెప్పుకునేందుకు వస్తున్నా.. వాటికి శాశ్వత పరిష్కారం చూపడం లేదని మండిపడ్డారు. సోమవారం పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్లో ఎస్డీసీని కలిసి వివిధ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నగరంలో గత కొన్ని నెలలుగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. ప్రజలు నీటి ఇబ్బందులతో బ్లాక్మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి తలెత్తిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షపాతం, నీటి లభ్యతను ముందుగానే అంచనా వేసి తాగునీటి భద్రతకు సమగ్ర ప్రణాళిక రూపొందించడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.
మందుల కొరతపై విచారణ చేయాలి
కేజీహెచ్లో మందులు అందుబాటులో లేవంటూ రోగులను ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాలని సూచిస్తున్నారని ఆరోపించారు. ఆక్సిజన్, మందులు, ఇంజెక్షన్ల సరఫరాలో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై జిల్లా యంత్రాంగం సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేజీహెచ్ను అభివృద్ధి చేసి పేదలకు మెరుగైన వైద్యం అందించామని గుర్తు చేశారు.
పోర్టు కాలుష్యంపై సమీక్ష ఏదీ?
పోర్టు కాలుష్యంతో పరిసర ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాలుష్య నివారణకు పోర్టు అథారిటీ కేటాయిస్తున్న సీఎస్ఆర్ నిధులను వినియోగించాల్సి ఉందన్నారు. గత 26 నెలల్లో పోర్టు పరిధిలో ప్రజల కోసం గతంలో మాదిరిగా వైద్య శిబిరాలు నిర్వహించారా? అని ప్రశ్నించారు. ప్రజల ఓట్లతో ఎన్నికై న ప్రజాప్రతినిధులు పోర్టు కాలుష్యంపై కనీసం సమీక్ష నిర్వహించారా? అని నిలదీశారు.
భూముల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి
కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కప్పరాడ సర్వే నంబర్ 13లో సుమారు మూడున్నర ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి షెడ్లు నిర్మించి విక్రయిస్తున్నారన్నారు. ఆధారాలతో ఫిర్యాదు చేశామని, చర్యలు తీసుకోకపోతే జిల్లా యంత్రాంగం, రెవెన్యూ అధికారుల తీరుపై ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. జీవో నంబర్ 296 ప్రకారం పేదల ఇళ్లు, స్థలాలను క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
జీవీఎంసీ పనితీరుపై విమర్శలు
నగరాభివృద్ధిలో జీవీఎంసీ పనితీరు సంతృప్తికరంగా లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తక్కువ వ్యవధిలోనే పలువురు కమిషనర్లు మారడంతో నగర సమస్యలపై అధికారులకు పూర్తిస్థాయి అవగాహన ఏర్పడటం లేదన్నారు. రోడ్ల విస్తరణలో భూములు కోల్పోయిన సామాన్యులకు నిబంధనల ప్రకారం రావాల్సిన పరిహారం, టీడీఆర్ తదితర ప్రయోజనాలు అందేలా చూడాలని కోరారు.
అధికారం శాశ్వతం కాదు
గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులను అర్ధరాత్రి సమయంలో ఖాళీ చేయించడం సరికాదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, అధికారులు ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సమన్వయకర్తలు తిప్పల శ్రీనివాస్ దేవన్ రెడ్డి, మొల్లి అప్పారావు, పార్టీ కార్యాలయ పర్యవేక్షకుడు రవి రెడ్డి, పార్టీ నాయకులు కట్టమూరు సతీష్, బాణాల సత్య శ్రీనివాసరావు, పేడాడ రమణికుమారి, సతీష్ వర్మ, సేనాపతి అప్పారావు, అనిల్కుమార్ రాజు, అల్లూ శంకరరావు, కొండా రాజీవ్గాంధీ, మంచా నాగమల్లేశ్వరి, పేర్ల విజయ్చందర్, జీలకర్ర నాగేంద్ర, అంబటి శైలేష్, ద్రోణంరాజు శ్రీవాత్సవ్, ఎం.సునీల్, శ్రీదేవివర్మ, జి.మనోజ్, డి.మార్కండేయులు, పి.ప్రేమ్కుమార్, శివరామకృష్ణ, సనపల రవీంద్రభరత్, సంతోష్, నీల రవి, ఈశ్వరరావు, పరదేశి, ఈశ్వరి, సి.హెచ్.నాగేశ్వరరావు, బొద్దేటి కిరణ్, భీశెట్టి ప్రసాద్, ధర్మాల శ్రీనివాసరావు, బోగవెల్లి గోవింద్, గాలి ప్రసాద్, ప్రదీప్, మువ్వల సంతోష్, హరికృష్ణ, మహేష్, సూర్య, అనిల్ శర్మ, మధు రెడ్డి పాల్గొన్నారు.


