విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో ఔత్సాహిక వికెట్ కీపర్ల కోసం నిర్వహించిన ప్రత్యేక శిక్షణ శిబిరంలో భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే కీలక మెళకువలు నేర్పారు. గురువారం విజయనగరంలోని నార్త్ జోన్ క్రికెట్ అకాడమీలో జరిగిన ఈ సెషన్లో అండర్–16, 19, 23 విభాగాలతో పాటు సీనియర్ మెన్ జట్టు కీపర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోరే తన సుదీర్ఘ అనుభవాన్ని కీపర్లతో పంచుకుంటూ, వారి నైపుణ్యాలను ఎలా మెరుగుపరుచుకోవాలో మార్గదర్శనం చేశారు. సీనియర్ కీపర్లు రికీ బుయ్, గిరినాథ్, రేవంత్ సహా వివిధ విభాగాలకు చెందిన లోహిత్, హేమంత్, రిషికుమార్ వంటి క్రీడాకారులు ఈ శిక్షణలో పాల్గొన్నారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని చిన్ని, కార్యదర్శి సతీష్ మాట్లాడుతూ.. ఆంధ్ర క్రికెటర్ల భవిష్యత్తుకు పునాది వేసేలా ఈ శిబిరాన్ని నిర్వహించినందుకు కిరణ్ మోరేను అభినందించారు.


