బీచ్రోడ్డు: నీట్ పరీక్షా పత్రం లీకేజీకి నిరసనగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద విద్యార్థి సంఘాలు భారీ నిరసన చేపట్టాయి. ఏఐడీఎస్వో, ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఈ ధర్నాలో విద్యార్థులు, విద్యావేత్తలు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న విద్యా వ్యవస్థను ఎన్టీఏ అస్తవ్యస్తం చేస్తోందని వారు విమర్శించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న పౌర చైతన్య వేదిక జిల్లా అధ్యక్షుడు ఆచార్య కోలవెన్ను చాంద్ మాట్లాడుతూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఎన్టీఏను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగం ప్రకారం విద్య ఉమ్మడి జాబితాలో ఉందని, కావున మెడికల్ ప్రవేశ పరీక్షల బాధ్యతను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని ఆలిండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటీ(ఏఐఎస్ఈసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.గోవిందరాజులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల ప్రతినిధులు అభిలాష్, సంతోష్ కుమార్, ధ్రువ్, రూపేష్ తదితరులు పాల్గొన్నారు.
ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ.. నీట్ డైరెక్టర్ జనరల్ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని, పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


