మహారాణిపేట: వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ, వాతావరణ మార్పుల దృష్ట్యా నగరాలు ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో నీటి భద్రత అత్యంత కీలకమైనదని కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ స్పష్టం చేశారు. ప్రతి నీటి బొట్టును సంరక్షించుకునే బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాకుండా అందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో మంగళవారం ‘క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఫర్ వాటర్ సెక్టార్’అనే అంశంపై జరిగిన వర్క్షాప్లో ఆయన మాట్లాడారు. సుస్థిర అభివృద్ధి కార్యక్రమాల్లో విశాఖపట్నం ముందంజలో ఉందని, అందరం కలిసి నీటి భద్రత కలిగిన నగరాన్ని నిర్మిద్దామని అన్నారు. రాష్ట్ర పారిశ్రామిక శాఖ కార్యదర్శి, విశాఖ ఎకనామిక్ రీజియన్ సీఈవో డాక్టర్ ఎన్.యువరాజ్ మాట్లాడుతూ.. విశాఖ ప్రాంతానికి దీర్ఘకాలిక నీటి భద్రత కోసం వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. వర్చువల్గా పాల్గొన్న పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.సురేష్ కుమార్ మాట్లాడుతూ.. నీటి రంగంలో మూలధన పెట్టుబడి ప్రణాళికల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం విధానపరమైన, ఆర్థికపరమైన పూర్తి మద్దతు అందిస్తుందని హామీ ఇచ్చారు. మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పి. సంపత్ కుమార్ మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లో దీర్ఘకాలిక నీటి వనరుల నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. మేయర్ పీలా శ్రీనివాసరావు, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ.. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా విశాఖ మెట్రోపాలిటన్ ప్రాంతంలో దీర్ఘకాలిక నీటి భద్రత సాధించేందుకు కట్టుబడి ఉన్నామని వివరించారు. కాగా.. వరల్డ్ బ్యాంక్ గ్రూప్నకు చెందిన ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, సింగపూర్ వాటర్ సెంటర్, యూరోపియన్ డెలిగేషన్ టు ఇండియా తదితర అంతర్జాతీయ సంస్థల సహకారంతో ఈ సదస్సు జరిగింది. విదేశీ ప్రతినిధులు, సాంకేతిక నిపుణులు పాల్గొని పట్టణ నీటి వ్యవస్థలో సమగ్ర ప్రణాళిక, డేటా ఆధారిత పెట్టుబడి వ్యూహాలపై లోతైన చర్చలు జరిపారు. కార్యక్రమంలో శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండుకర్, విశాఖ జేసీ జి.విద్యాధరి, నీతి ఆయోగ్ రిటైర్డ్ అధికారి కిశోర్ సహా పలు జిల్లాల మున్సిపల్ కమిషనర్లు, జీవీఎంసీ అదనపు కమిషనర్లు ఎస్.ఎస్. వర్మ, డి.వి.రమణమూర్తి, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం చివరలో విశాఖ నీటి రంగానికి సంబంధించి జీవీఎంసీ ప్రత్యేకంగా రూపొందించిన ‘క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్’ ఫ్లయ్యర్ను అతిథులు ఆవిష్కరించారు.


