
రక్తదానంతో ఆరోగ్యం
ఆరిలోవ: రక్తదానం చేసినవారికి ఆరోగ్యంతో పాటు, మానసిక ఆనందం కలుగుతుందని విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) డైరెక్టర్ డాక్టర్ కె.రాంబాబు అన్నారు. ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని శుక్రవారం విమ్స్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విమ్స్ సిబ్బంది చేపట్టిన రక్తదాన అవగాహన ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. సిబ్బంది ప్లకార్డులతో నినాదాలు చేస్తూ విమ్స్ పరిపాలనా విభాగం నుంచి జాతీయరహదారి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ రాంబాబు మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు రక్తదానం చేయడం ఆరోగ్యానికి మంచిదన్నారు. రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నవారవుతారని పేర్కొన్నారు. విమ్స్లో ఆరు నెలల నుంచి రక్తనిధి అందుబాటులో ఉందన్నారు. ఇంతవరకు 8 రక్తదాన శిబిరాలు నిర్వహించి వాటి ద్వారా 542 యూనిట్ల రక్తం సేకరించినట్లు వెల్లడించారు. రక్త హీనత, తలసేమియా రోగులకు త్వరలో ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేయనున్నామన్నారు. కార్యక్రమంలో విమ్స్ వైద్యులు, సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.