అనంతగిరి: రోజువారి లక్ష్యాలను నిర్దేశించుకుని ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ దీపక్తివారి సూచించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడు రోజుల్లో సర్ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. ఓటరు జాబితాలో అర్హులు మాత్రమే ఉండాలని, అనర్హుల పేర్లు తొలగించాలని తెలిపారు. మార్పులు, చేర్పులు, సవరణ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. బూత్ లెవల్ అధికారులను సమన్వయం చేసుకుని ఇంటింటి ధ్రువీకరణను సమర్థవంతంగా నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో ట్రైయినీ కలెక్టర్ సచిన్ బస్వరాజ్, జెడ్పీ సీఈఓ సుధీర్, డీఆర్డీఓ స్వర్ణలత, ఆర్డీఓ వాసుచంద్ర, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నేమత్ అలి తదితరులు పాల్గొన్నారు.


