పక్కాగా.. బస్సొచ్చేలా.. | - | Sakshi
Sakshi News home page

పక్కాగా.. బస్సొచ్చేలా..

Jul 4 2026 9:34 AM | Updated on Jul 4 2026 9:34 AM

సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సుల ట్రిప్పులను ఆకస్మికంగా రద్దు చేసే చర్యలను అరికట్టేందుకు ఆర్టీసీ భారీ కసరత్తు చేపట్టింది. ఉదయం మొదటి బస్సు నుంచి రాత్రి చివరి బస్సు వరకు పూర్తిస్థాయిలో నడిపేందుకు నిర్వహణ వ్యవస్థను పటిష్టం చేసింది. సాధారణంగా డ్రైవర్లు, కండక్టర్లు వివిధ కారణాలతో చివరి ట్రిప్పు సర్వీసులను రద్దు చేస్తుండటంతో అప్పటిదాకా ఎదురుచూసిన ప్రయాణికులు చివరకు ఆటోలు, క్యాబ్‌లు ఇతర ప్రైవేట్‌ వాహనా లను ఆశ్రయిస్తున్నారు. నగరంలోని వివిధ మార్గాల్లో ప్రతిరోజూ వందల సంఖ్యలో ట్రిప్పులు రద్దవుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మరోవైపు ఆర్టీసీ ఆదాయానికి సైతం గండి పడుతోంది. ఈ క్రమంలో ఆర్టీసీ గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సిటీ బస్సుల నిర్వహణపై సీరియస్‌గా దృష్టి సారించారు. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో అధికారులు ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో స్వయంగా విధులు నిర్వర్తించేలా దిశా నిర్దేశం చేశారు. దీంతో కొద్ది రోజులుగా నగరంలో సిటీబస్సుల ట్రిప్పుల సంఖ్య పెరిగింది. గతంలో నిత్యం 34,200 ట్రిప్పులు తిరిగితే.. ప్రస్తుతం 35,000కు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

సేవలు మెరుగు

ఘట్కేసర్‌, కీసర, బోగారం, హయత్‌నగర్‌, గండిమైసమ్మ, ఇబ్రహీంపట్నం, మంచిరేవుల, కుత్బుల్లా పూర్‌, మేడ్చల్‌ వంటి నగర శివారు ప్రాంతాల నుంచి సికింద్రాబాద్‌, కోఠి, పటాన్‌చెరు, బీహెచ్‌ఈఎల్‌, మెహిదీపట్నం తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీ భారీగా ఉంటుంది. కాలేజీలకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు తదితర వర్గాలకు సిటీ బస్సులే ఆధారం. ఏదో ఒక కారణంతో ఆర్టీసీ సిబ్బంది తెల్లవారుజామున బయలుదేరాల్సిన బస్సులను, రాత్రిపూట చేరుకోవాల్సిన చివరి సర్వీసులను రద్దు చేస్తు న్నారు. దీంతో సెవెన్‌సీటర్‌ వంటి ఆటో రిక్షాలు, ఇతర మార్గాల్లో ప్రయాణికులు వెళ్తున్నారు. ప్రస్తుతం ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని డిపోల్లో బస్సులను పూర్తిగా నడిపి ప్రయాణికులకు మెరుగైన సేవలను అందజేస్తున్నామని ఈడీ శ్రీధర్‌ తెలిపారు. ‘ప్రస్తుతం 26 డిపోల ద్వారా రోజుకు 3,200 బస్సులు నడుపుతున్నాం. వీటిలో ఏ ఒక్కటి రద్దయినా సంబంధిత అధికారులు బాధ్యత వహించాల్సిందే’ అని చెప్పారు.

పెరిగిన ప్రయాణికుల సంఖ్య

బస్సుల్లో ప్రతిరోజూ తిరిగే ప్రయాణికుల సంఖ్య 23 లక్షల నుంచి 25 లక్షలకు పెరిగింది. కొంతకాలంగా 2 లక్షల మంది అదనంగా ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం 19 లక్షల మంది మహిళలు, 6 లక్షల మంది పురుషులు నిత్యం పయనిస్తున్నారు.

బస్సుల సంఖ్య

ఆకస్మికంగా ట్రిప్పుల రద్దు ఉండదిక

చివరి సర్వీసూ రోడ్డెక్కాల్సిందే..

అన్ని వైపులా కనెక్టివిటీకి చర్యలు

నగర ఆర్టీసీ అధికారుల కసరత్తు

సమయపాలన పాటించేలా సిబ్బందికి దిశానిర్దేశం

26

3,200

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement