గుర్తు తెలియని వృద్ధురాలి మృతి
తాండూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధురాలు మృతిచెందింది. ఈ ఘటన శనివారం కరన్కోట్ పోలీస్స్టేషన్ పరిధిలోని గౌతాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది. ఎస్ఐ రాథోడ్ వినోద్ కథనం మేరకు గౌతాపూర్ రిలయన్స్ పెట్రోల్ పంపు వద్ద మల్లమ్మ(65) రోడ్డు ప్రమాదానికి గురైంది. వెంటనే ఆమెను స్థానికులు 108లో తాండూరు పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మల్లమ్మది ఏ ఊరు అనేది తెలియదని పోలీసులు తెలిపారు. గౌతాపూర్ పంచాయతీ కార్యదర్శి ఫక్రోజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపర్చినట్లు తెలిపారు.
బైక్తో లారీని ఢీకొట్టి
వ్యక్తి మృతి
పరిగి: జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతిచెందాడు. మండల పరిధిలోని రంగంపల్లి గేటు సమీపంలో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుద్యాల మండలం ఈర్లపల్లికి చెందిన దస్తప్ప(38) పరిగి నుంచి స్వగ్రామానికి వెళ్తుండగా రంగంపల్లి గేటు సమీపంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిగి ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీకొని వ్యక్తి మృతి
కందుకూరు: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ సీతారామ్ తెలిపిన వివరాలు.. కడ్తాల్ మండలం గోవిందపల్లికి చెందిన కంబాలపల్లి అంజయ్య(38), భార్య సువర్ణ, పిల్లలతో కలిసి కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. తుమ్మలూరు పరిధిలోని బీటీఆర్లో కూలీ పనులు చేయడానికి వెళ్లిన సువర్ణను తీసుకువచ్చేందుకు శుక్రవారం రాత్రి బైక్పై బయలుదేరాడు. మార్గమధ్యలో దెబ్బడగూడ గేట్ వద్ద శ్రీశైలం రహదారిపై ఎదురుగా వచ్చిన కారు అంజయ్య బైక్ను ఢీకొట్టింది. ఈప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ అతన్ని 108 అంబులెన్స్లో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ మేరకు ఎస్ఐ పరమేశ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


