ఏడు మేకలు అపహరణ కేసు నమోదు
పూడూరు: మండల పరిధిలోని తిర్మలాపూర్లో ఏడు మేకలు గుర్తు తెలియని దుండుగులు అపహరించారు. చన్గోముల్ ఎస్ఐ భరత్రెడ్డి తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన పాత్లావత్ సోమ్లీబాయి రోజుమాదిరిగానే శనివారం ఇంటి ఎదురుగా పాకలో మేకలు ఉంచి నిద్రకు ఉపక్రమించారు. ఆదివారం ఉదయం లేచేవరకు కనిపించకపోవడంతో ఊరంతా వెతికారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తులో ఉంది.
ఆర్టీసీ బస్సు ఢీకొని
వ్యక్తి మృతి
యాచారం: నాగార్జునసాగర్–హైదరాబాద్ రహదారిపై యాచారం మండల కేంద్రంలో ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఢీకొని ఓ వ్యక్తికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మంచాల మండలం శ్రీ వేంకటేశ్వరతండాకు చెందిన జాటోత్ హర్యానాయక్(48) ఆదివారం ఉదయం వ్యక్తిగత పని మీద బైక్పై మండల కేంద్రానికి వచ్చారు. స్థానికంగా మొండిగౌరెల్లి మార్గం నుంచి హైవే పైకి వస్తుండగా ఇబ్రహీంపట్నం నుంచి మాల్ వైపు వెళ్తున్న దేవరకొండ డిపోనకు చెందిన ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సు ఆయన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పైనుంచి బస్సు చక్రం కిందకు వెళ్లగా, హర్యానాయక్కు తీవ్ర గాయాలై ఎగిరి రెండు మీటర్ల దూరంలో పడిపోయారు. తలకు తీవ్ర రక్తస్రావమైంది. స్థానికులు 108 అంబులైన్స్లోకి ఎక్కిస్తుండగానే ఆయన మృతి చెందారు. మృతుడికి భార్య సుగుణతో పాటు ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ప్రయాణికుల ఆగ్రహం
సాగర్రోడ్డుపై దేవరకొండ ఆర్టీసీ బస్సుల అతివేగంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు ఆందోళన చేపట్టారు. అతివేగం, డ్రైవర్లు ఫోన్లు మాట్లాడుతూ నిర్లక్ష్యంగా బస్సులను నడపడంతో ప్రమాదాలు చోటుచేసుకుని పలువురు మృతి చెందుతున్నారని ప్రజలు మండిపడ్డారు. కొద్దిసేపు ఆందోళన చేపట్టారు.
నిందితులను
శిక్షించాలని దీక్ష
చేవెళ్ల: ఇటీవల అడ్వకేట్ స్వప్నను ఆస్తి కోసం సోదరుడు దారుణంగా హత్య చేయించిన సంఘటనలో న్యాయంకోసం కోర్టు ఎదుట న్యాయవాదులు చేస్తున్న రిలే దీక్ష ఆదివారం కూడా కొనసాగింది. ఇందులో బార్ కౌన్సిల్ కంటెస్టింగ్ మెంబర్స్ తేజస్వినిరెడ్డి, జక్కుల వంశీకృష్ణలు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని కోరారు. దీనికి కారణమైన దీని వెనక ఉన్న వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో చేవెళ్ల బార్ అసోసియేషన్ న్యాయవాదులు పాండురంగారెడ్డి, శంసోద్దీన్, బాలస్వామి, సత్యానందం, రాజశేఖర్, ఉదయ్, శివరాజ్, సాయిరాం, ఆనంద్, అభిలాస్రెడ్డి, శ్రావణ్, జ్యోతి, విఠల్, వినయ్, సందీప్, రవీందర్, స్నేహ, చందు తదితరులు పాల్గొన్నారు.
వ్యభిచార గృహంపై దాడి
వెంగళరావునగర్: మధురానగర్ పోలీసులు వ్యభిచార కేంద్రంపై దాడిచేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. మధురానగర్కాలనీలో ఇద్దరు మహిళలు ఓ గదిని అద్దెకు తీసుకొని వ్యభిచారం చేస్తున్నారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో శనివారం సాయంత్రం దాడిచేసి ఓ విటుడిని, నిర్వాహకురాలిని అదుపులోకి తీసుకున్నారు. మరో మహిళ పరారీలో ఉంది.
ఏడు మేకలు అపహరణ కేసు నమోదు


