కదిలిస్తే..కన్నీళ్లే.. | - | Sakshi
Sakshi News home page

కదిలిస్తే..కన్నీళ్లే..

Nov 5 2025 9:14 AM | Updated on Nov 5 2025 9:14 AM

కదిలి

కదిలిస్తే..కన్నీళ్లే..

● కూతురే కొండంత ధైర్యంగా ఉండేది

బేటీకో చోడ్కే ఆఉంగా అని వెళ్లాడు

మీర్జాగూడ ప్రమాదం మృతుల కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది.. తమ వారిని తలచుకుని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.. అశ్రునయనాలతో కడసారిగా సాగనంపారు.. నిన్నటివరకు తమతోనే ఉన్నవారు ఇక తిరిగిరారన్న చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.. ఇంకా షాక్‌ నుంచి తేరుకోలేదు.. ఎవరిని కదిలించినా కన్నీళ్లే.. అంతులేని ఆవేదనే.. ఎక్కడ చూసినా ఇదే చర్చ.. ఏ నోట విన్నా ‘అయ్యో ఎంతటి ఘోరం’ అన్న మాటలే.. మరోవైపు ప్రమాదంలో గాయపడినవారు ఆయా ఆస్పత్రుల్లో కోలుకుంటున్నారు.. తమవారిని ఈ స్థితిలో చూసి అయినవారు తల్లడిల్లిపోతున్నారు..

తేరుకోని బాధితులు తల్లడిల్లిన హృదయాలు అంతులేని విషాదం నింపిన మీర్జాగూడ ప్రమాదం

మృతురాలి తండ్రి చాంద్‌పాషా ఆవేదన

తాండూరు రూరల్‌: మండలంలోని కరన్‌కోట్‌ గ్రామానికి చెందిన చాంద్‌పాషా గౌతాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె పెళ్లి చేసి అత్తారింటికి పంపాం. చిన్న కూతురు ముస్కాన్‌ బేగం. తాండూరులో ఇంటర్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లోని కోఠి ఉమెన్స్‌ కాలేజీలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ముస్కాన్‌బేగం నాకు కొండంత ధైర్యమని చాంద్‌పాషా తెలిపాడు. కొడుకు లేడన్న లోటును తీర్చిందన్నారు. వ్యాపారంలో, కుటుంబ విషయంలో ఆమె చెప్పినట్లే వినేవాడిని పేర్కొన్నారు. చదువులో ఫస్ట్‌గా ఉండేదని, వ్యాపారం లేదా టీచర్‌ ఉద్యోగంలో రాణిస్తానని చెప్పేదన్నారు. బస్సు ప్రమాదంలో చిన్న కూతురు చనిపోయిందని ఇంకా ఆ షాక్‌లోనే ఉన్నానని తెలిపారు.

మృత్యువులోనూ వీడని స్నేహం

యాలాల మండలం పేర్కంపల్లికి చెందిన ముగ్గురు అక్కా చెల్లెళ్లు మృతి చెందిన విషయం తెలిసిందే. ముస్కాన్‌బేగంకు సాయిప్రియ తోపాటు అమె చెల్లి, అక్క స్నేహితులు. అందరూ హైదరాబాద్‌లో చదువుకుంటున్నారు. కళాశాలకు సెలవు ఉంటే అందరూ తాండూరు వస్తారు. ఆ తర్వాత అందరూ కలిసే హైదరాబాద్‌ వెళ్తారు. ఇలా సోమవారం తెల్లవారుజమూనా కూడా నగరానికి వెళ్తూ కానరాని లోకానికి వెళ్లిపోయారని తండ్రి చాంద్‌పాషా ఆవేదన వ్యక్తం చేశారు.

చాంద్‌పాషా

అయినవారి ఆక్రందనలు

తాండూరు: బేటీకో సాసురాల్‌ కనే చోడ్కే షామ్‌ తక్‌ ఆఉంగా అంటూ ఇంట్లో నుంచి చెప్పి వెళ్లన నా భర్త ఇలా సాయంత్రం వరకు శవమై వస్తాడని అనుకోలేదని.. ఇప్పుడు నా గతి... నా పిల్లల గతి ఏంకాను అని మృతుడు షేక్‌ ఖాలీద్‌ భార్య రెహానాబేగం కన్నీరుమున్నీరైంది. మీర్జాగూడా వద్ద జరిగిన ప్రమాదంలో ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న షేక్‌ ఖాలీద్‌తో పాటు కూతురు సాలేహ, మనుమరాలు రెండు నెలల ఫాతిమా సంఘటనా స్థలంలోనే మృతి చెందిన విషయం తెలిసిందే. వీరి మృతితో మంగళవారం కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడి భార్య రెహానాను సాక్షి పలకరించింది. ఆమె మాటల్లోనే.. ‘20 ఏళ్లుగా తాండూరు పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నాం. కొన్నాళ్ల క్రితం ఇందిరమ్మ కాలనీలో ఇంటిని అద్దెకు తీసుకొని పిల్లలతో కలిసి ఉంటున్నాం. భర్త వెల్డర్‌గా పని చేస్తాడు. నేను బీడీలు చుట్టి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మాకు నలుగురు సంతానం. పెద్ద కూతురు సాలేహా బేగంను పదో తరగతి వరకు చదివించి గతేడాది సెప్టెంబర్‌ 26న పెళ్లి చేశాం. ఇద్దరు కవలలు సమీర్‌, జమీర్‌ ప్రస్తుతం నంబర్‌ 2 ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. మరో కూతురు సాదియా బేగం తొమ్మిదో తరగతి చదువుతోంది. కూతురు సాలేహాకు ప్రసవం తర్వాత హైదరాబాద్‌ నుంచి తాండూరుకు తీసుకొచ్చాం. మనవరాలికి 40 రోజుల తర్వాత చేసే కార్యక్రమానికి పంపించాలని అత్తింటి వాళ్లు ఫోన్‌ చేయడంతో సోమవారం బస్సు ఎక్కారు. బిడ్డను విడిచి సాయంత్రం వరకు వస్తా అన్న మనిషి ఇలా ప్రాణం లేకుండా వస్తాడని అనుకోలేదు’ అంటూ కన్నీటిపర్యంతమైంది.

కదిలిస్తే..కన్నీళ్లే..1
1/2

కదిలిస్తే..కన్నీళ్లే..

కదిలిస్తే..కన్నీళ్లే..2
2/2

కదిలిస్తే..కన్నీళ్లే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement