
వృద్ధుల బాధ్యత వారసులదే
సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మధుసూదనరావు
మొయినాబాద్రూరల్: వయోవృద్ధుల పోషణ, సంక్షేమం చట్టపరంగా వారి పిల్లలే చూసుకోవాలని సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మధుసూదనరావు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కొంపల్లి అనంతరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని అంజనాదేవి గార్డెన్స్లో సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ సమావేశాన్ని డాక్టర్ వి.పాండుగౌడ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మధుసూదనరావు, అనంతరెడ్డిలు హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు, వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం–2007, నియమావళి రూల్స్ 2011ను వివరించారు. డాక్టర్ పాండుగౌడ్ మాట్లాడుతూ.. ఇండియన్స్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా సీనియర్ సిటిజన్స్కు ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. అందరం కలిసి పేద కుటుంబాల ప్రజలకు సహాయం అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ప్రతి గ్రామంలో సంఘాలు ఏర్పాటు చేయాలని చట్టం 2007 అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఉపాధ్యక్షులు సత్తయ్య, నాయకులు ఉపేందర్రెడ్డి, అనంతరెడ్డి, భాస్కర్, రమేశ్, చంద్రలింగం, సంగరి మల్లేశ్, గోపాల్రెడ్డి, మల్లారెడ్డి, కిషన్, రామ్మోహన్, సుగుణాకర్రావు, సయ్యాజీరావు, బల్వంత్రెడ్డి, కృష్ణారెడ్డి, రవీందర్రెడ్డి పాల్గొన్నారు.
సబ్రిజిస్ట్రార్పై దాడి అమానుషం
తీవ్రంగా ఖండించిన గెజిటెడ్ అధికారుల సంఘం
ఇబ్రహీంపట్నం రూరల్: విధి నిర్వహణలో ఉన్న పెద్దఅంబర్పేట్ సబ్రిజిస్ట్రార్పై దాడి చేయడం అమానుషమని గెజిటెడ్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామారావు, కార్యదర్శి శ్రీనేష్ కుమార్ నోరీలు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ సెక్రెటరీ బుద్ధ ప్రకాష్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సబ్రిజిస్ట్రార్పై దాడికి పాల్పడిన వ్యక్తిని వెంటనే జైలుకు పంపించాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ విధి నిర్వహణ ప్రకారం పని చేస్తారన్నారు. అధికారులు తప్పు చేస్తే ఫిర్యాదులు చేయాలి కాని, భౌతిక దాడులకు పాల్పడటం తగ దని హెచ్చరించారు. గెజిటెడ్ ఉద్యోగులు కలెక్టరేట్ నందు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపినట్లు చెప్పారు. దోషులను కఠినంగా శిక్షించే వరకు ఉరుకోబోమని తెలిపారు. కార్యక్రమంలో స్టాంప్స్, సబ్రిజిస్ట్రార్ సంఘం బాధ్యులు సహదేవ్, స్తితి ప్రజ్ఞ, వెంకటేష్, నూతనగంటి వెంకట్, శాంతి శ్రీ, అలివేలు, లక్ష్మణ్ స్వామి, సుజాత, సైదమ్మ, నాగేశ్వర్రావు, సీడీపీఓ, ఈఈఎస్, డీఈఈఎస్, కలెక్టరేట్ గజిటెడ్, నాన్ గెజిటెడ్, సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.
పెద్దమంగళారంలో భారీ చోరీ
మొయినాబాద్: గుర్తుతెలియని దుండగులు ఇంట్లో బీరువా తాళాలు పగులగొట్టి బంగారం, నగదు దోచుకెళ్లారు. ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలోని చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దమంగళారంకు చెందిన అప్పల హరీష్యాదవ్ సోమవారం రాత్రి 9 గంటలకు మొయినాబాద్లో ఉన్న తన అన్న సురేష్ ఇంటికి వెళ్లాడు. రాత్రి ఆలస్యం కావడంతో అక్కడే ఉన్నాడు. మంగళవారం ఉదయం 7 గంటలకు తిరిగి వెళ్లే సరికి ఇంటి తాళం కనిపించలేదు. లోపలికి వెళ్లి చూశాక బీరువా తాళాలు పగులగొట్టి తెరిచి ఉంది. అందులో ఉన్న 26 తులాల బంగారం, రూ.2.50 లక్షల నగదు కనిపించలేదు. రాత్రి సమయంలో దుండగులు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి వేలిముద్రలు సేకరించారు.