కొడంగల్ రూరల్: రైతాంగానికి నాణ్యమైన విత్తనా లు, ఎరువులు అందుబాటులో ఉంచాలని జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి డీలర్లకు సూచించారు. బుధవారం మండలంలోని పర్సాపూర్ రైతు వేదికలో డివిజన్లోని ఎరువుల దుకాణాల డీలర్లకు వ్యవసాయ చట్టాలపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నకిలీ విత్తనాలు, కల్తీ ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విత్తనాలు, ఎరువులు, పురుగు మందు కొనుగోలు చేసే రైతులకు బిల్లులు ఇవ్వాలని ఆదేశించారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు విక్రయించరాదని, లేబుల్ లేని విత్తనాలు విక్రయిస్తే చర్యలు ఉంటాయన్నారు. అనుమతి లేని విత్తనాలు, నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా డీలర్లు అధికారులకు సహకరించాలని కోరారు. విత్తనాలను అక్రమంగా నిల్వ చేసినా, రవాణా చేసినా, ప్యాకెట్ లేకుండా లూజుగా అమ్మినా జరిమానా తోపాటు శిక్ష తప్పదన్నారు. రైతులను మోసం చేస్తే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. స్టాక్కు సంబంధించి ఎప్పటికప్పుడు రికార్డులు నమోదు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ శంకర్ రాథోడ్, మండల వ్యవసాయాధికారులు జి.తులసి, హిమబిందు, ఏఈఓలు రాజు రాథోడ్, అశ్విని, డీలర్లు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయాధికారి మోహన్రెడ్డి
ఎరువుల దుకాణాల డీలర్లతో సమావేశం
వ్యవసాయ చట్టాలపై అవగాహన ఉండాలని సూచన