తెప్పపై సీతారామలక్ష్మణులు
తిరుమల: కలియుగవైకుంఠం తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు గురువారం సాయంత్రం వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యుద్దీపాలు, పుష్పాలతో సర్వాంగసుందరంగా అలంకరించిన తెప్పపై సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేతంగా శ్రీరామచంద్రమూర్తి దర్శనమిచ్చారు. ముందుగా సాయంత్రం 6 గంటలకు సీతా లక్ష్మణ ఆంజనేయ సమేత రామచంద్రుని ఉత్సవమూర్తులు ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. తొలిరోజు స్వామివారు పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు ప్రదక్షిణ చేస్తూ భక్తులను ఆశీర్వదించారు. వేదం, గానం, నాదం మధ్య తెప్పోత్సవం వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈఓ సీహెచ్ వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ పాల్గొన్నారు.
తెప్పపై సీతారామలక్ష్మణులు


