పది పరీక్షలపై ప్రైవేటు
చంద్రబాబు అన్ని రంగాల్లో పీపీఈ పాట పాడుతున్నారు.. మొన్నటి వరకు రహదారులు తదితర శాఖలకే ఈ విధానం ఉండేది. నిన్న వైద్యవిద్యను పీపీఈ చేసి భ్రష్టు పట్టించారు.. అది చాలదన్నట్లు నేడు పది పరీక్షలనూ పీపీఈ విధానంలోకి నెట్టేస్తున్నారు. ఫలితంగా ప్రైవేటు, కార్పొరేట్ విద్యార్థులు మాస్ కాపీయింగ్ చేయించే అవకాశం ఉంది. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నష్టపోక తప్పదు.
తిరుపతి అర్బన్: రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఈసారి మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు జరగనున్న పదో తరగతి పరీక్షల్లో ప్రైవేటు భాగస్వామ్యం కల్పించారు. ఈ నిర్ణయం మాస్ కాఫీయింగ్కు ప్రభుత్వం అవకాశం కల్పిస్తున్నట్లు ఉందంటూ పలువురు చర్చించుకుంటున్నారు. అలాగే తొలిసారిగా ఉపాధ్యాయులకు టెన్త్ పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్ల డ్యూటీలు జిల్లా విద్యాశాఖ నుంచి కాకుండా..రాష్ట్రస్థాయి నుంచే ఉపాధ్యాయుల డ్యూటీల ఎంపిక చేస్తున్నారు. ఈ అంశంపై గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని పలువురు ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
25 శాతం ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు డ్యూటీలు
ప్రైవేటు స్కూళ్లలో ఐదేళ్లుగా పనిచేస్తూ బీఈడీ క్వాలిఫికేషన్ ఉండే టీచర్లకు పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇన్విజిలేటర్ల డ్యూటీలు వేస్తున్నారు. అలాగే చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులుగా విధులు నిర్వహించడానికి ప్రైవేటు భాగస్వామ్యం ఉంటుందని తెలుస్తోంది. ఆ దిశగా విద్యాశాఖ జోరుగా కసరత్తు చేస్తోంది. జిల్లాధికారులకు సైతం విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో 25 శాతం మంది ప్రైవేటు పాఠశాలల టీచర్లు, 75 శాతం మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు విధి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నారు.
ఎస్ఎస్ఈ బోర్డు నుంచే డ్యూటీల ప్రక్రియ
ఎస్ఎస్ఈ బోర్డు నుంచే ఈ ప్రక్రియ నడుస్తోంది. టీచర్ ఇన్ఫర్మేషన్ సిస్టం (టిస్) ఆధారంగా హెచ్ఎంలు, టీచర్ల జాబితా తయారు చేసి ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలకు పంపారు. వారు ఆ జాబితాలను పరిశీలించి ప్రతి టీచరుకూ సంబంధించి రిమార్కులు రాసి పంపాలి. నిబంధనల మేరకు అనర్హులైన వారిని తొలిగించి. అర్హులైన వారిని విధుల్లో నియమిస్తారు. ఈ విషయాలను వెబెక్స్లో(దృశ్య శ్రవణ సమావేశంలో) విద్యాశాఖ కమిషనర్ జిల్లాల అధికారులకు స్పష్టం చేశారు. మరోవైపు 60 ఏళ్లు నిండిన వారికి, ఐదేళ్లలోపు సర్వీస్ ఉన్నవారికి డ్యూటీల నుంచి మినహాయింపు ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి మినహాయింపు కల్పిస్తున్నారు. అయితే వీరు సంబంధిత మెడికల్ ధ్రువీకరణ సర్టిఫికెట్లను ఎంఈఓలు, డిప్యూటీ డీఈఓలకు అందజేయాల్సి ఉంటుంది.
పదో తరగతి పరీక్షల జిల్లా సమాచారం
పటిష్టమైన చర్యలు చేపట్టాలంటున్న తల్లిదండ్రులు.
దశాబద్దాలుగా చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రమే పదో తరగతి పరీక్షల ఇన్విజిలేటర్ల డ్యూటీలు వేసేవారు. అయితే కొత్తగా చంద్రబాబు ప్రైవేటు భాగస్వామ్యం పాటపాడుతున్న నేపథ్యంలో ప్రైవేటు టీచర్లకు డ్యూటీలు ఇస్తున్నారు. ఈ అంశంపై పేద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.


