శ్రీవారి సేవలో అపోలో చైర్మన్
తిరుమల: అపోలో చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలు అందించగా.. టీటీడీ అధికారులు లడ్డూ ప్రసాదాలతో సత్కరించారు.
యువతి ఆత్మహత్య
తిరుపతి క్రైం : ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి టౌన్ కొర్లగుంట మారుతీనగర్కు చెందిన ఎం. దివ్య శుక్రవారం మధ్యాహ్నం సుమారు 12.45 గంటల సమయంలో ఇంట్లోనే ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి మోహన్ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇంట్లో జరిగిన చిన్న చిన్న గొడవల నేపథ్యంలో దివ్య తొందరపాటు నిర్ణయం తీసుకుని ఈ దారుణానికి పాల్పడిందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ స్వాతి తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
యువకుడి మృతి
చంద్రగిరి: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి పూతలపట్టు జాతీయరహదారిలోని చంద్రగిరి సమీపంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరులోని నేతాజీ నగర్కు చెందిన పుసుపులేటి రోషన్ కుమార్(20) చిత్తూరు నుంచి తిరుపతి వైపుగా బుల్లెట్లో వెళుతున్నాడు. ఈ క్రమంలో చంద్రగిరి జాతీయ రహదారి ఫ్లైఓవర్ దిగగానే ముందు వెళుతున్న వాహనం సడన్గా బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న రోషన్ ఆ వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో రోషన్ తలకు తీవ్ర గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ అరుణాచలం ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీవారి సేవలో అపోలో చైర్మన్
శ్రీవారి సేవలో అపోలో చైర్మన్


