ట్రైనింగ్ రద్దు చేసుకున్న కలెక్టర్
తిరుపతి అర్బన్: జిల్లాలో రెగ్యులర్ జాయింట్ కలెక్టర్ 100 రోజులుగా లేకపోవడంతో నెలకొన్న రెవెన్యూ సమస్యలను వివరిస్తూ సాక్షి దినపత్రికలో శనివారం ‘కలెక్టరేట్..పాలన సఫరేట్’ అనే శీర్షికతో కథనం ప్రచురించిన విష యం తెలిసిందే. ఈ క్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్ ఈ నెల 5 నుంచి 30వ తేదీ వరకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరి లో ట్రైనింగ్కు వెళ్లాల్సిన ఉన్నప్పటికీ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. అయితే కలెక్టర్ శనివారం ఓ ప్రకటనలో ఈ నెల 10, 11 తేదీల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ ఉండడంతో తమ ట్రై నింగ్ ప్రోగ్రామ్తోపాటు సీఎం, ఇతర ప్రముఖు ల పర్యటన ఉన్న నేపథ్యంలో తమ ట్రైనింగ్ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
కోర్టును ఆశ్రయించిన వీసీ
తిరుపతి సిటీ: ఎస్వీ వేదిక్ వర్సిటీ వీసీ రాణి సదాశివమూర్తి హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. వీసీ పదవి నుంచి ఆయన్ని అనర్హుడిగా విజిలెన్స్ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. దీంతో బోర్డు నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం.
రేపటి నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలు
తిరుపతి అర్బన్: అలిపిరి రోడ్డులోని ఐయాన్ డిజిటల్ జోన్ కేంద్రంలో సోమవారం నుంచి ఈ నెల 10వ తేదీ వరకు ఏపీపీఎస్సీ కంప్యూటర్ డిపార్ట్మెంటల్ పరీక్షలు జరుగుతాయని డీఆర్వో నరసింహులు తెలిపారు. శనివారం ఆయన కలెక్టరేట్ నుంచి జూమ్ మీటింగ్ ద్వారా అధికారులకు ఏర్పాట్లుపై సూచనలు చేశారు. 1,188 మంది పరీక్షకు హజరుకానున్నారని పేర్కొన్నారు. పరీక్షకు ఎలక్ట్రికల్ వస్తువుల అనుమతి లేదని వెల్లడించారు.
ఇండిగో విమానం గాలిలో చక్కర్లు
రేణిగుంట: హైదరాబాద్ నుంచి రేణిగుంటకు శని వారం రాత్రి 7.20 గంటలకు చేరుకుని 8 గంటలకు తిరిగి వెళ్లాల్సిన ఇండిగో విమానం ల్యాండ్ అవుతుండగా మళ్లీ టేక్ ఆఫ్ అయ్యింది. సుమా రు 20 నిమిషాల పాటు గాలిలో చక్కర్లు కొట్టిన అనంతరం 7.40 కి విమానం సురక్షితంగా రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ఈ విమానంలో ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉన్నారు. ఆయన తిరుమలకు బయల్దేరి వెళ్లారు.
శ్రీవారి దర్శనానికి 12 గంటలు
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని 31 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 83,032 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,272 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.81 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
ట్రైనింగ్ రద్దు చేసుకున్న కలెక్టర్


