
సాంకేతిక పరిజ్ఞానంతో హత్యకేసును ఛేదించిన పోలీసులు
ఐదుగురు నిందితులకు రిమాండ్
వనపర్తి(మహబూబ్నగర్): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నా డని కట్టుకున్న భర్తను కడతేర్చిందో భార్య. వనపర్తి జిల్లా పెబ్బేరు పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ వెల్లడించారు. సూగూరు గ్రామానికి చెందిన రవి, అతడి భార్య సునీత మేస్త్రి నరేశ్ వద్ద పనిచేస్తుండే వారు. క్రమంలో శ్రీరంగాపూర్కు చెందిన అరవింద్తో సునీతకు పరిచయమై వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ విషయం భర్త రవికి తెలియడంతో అరవింద్ను హెచ్చరించాడు. అప్పటి నుంచి రవి తన భార్య సునీతను ఇబ్బంది పెడుతుండేవాడు. ఈ క్రమంలో తన భర్త అడ్డు తొలగించాలని ప్రియుడు అరవింద్కు చెప్పడంతో గత నెల 18న అతడు తన స్నేహితులైన భగవంతు, గిరితో కలిసి అయ్యవారిపల్లిలో మద్యం తాగుతూ రవి హత్యకు పథకం రచించారు.
ఈ మేరకు మార్చి 19న సాయంత్రం అరవింద్ తన స్నేహితుడైన సూగూరుకు చెందిన బాష కారును అవసరం ఉందని తీసుకుని అయ్యవారిపల్లిలో భగవంతు, గిరిని ఎక్కించుకున్నాడు. వెంకటాపురంలో ఒక కిరాణం షాపులో మద్యం, వాటర్ బాటిల్స్, నల్ల కవర్స్ తీసుకున్నారు. అక్కడి నుంచి సూగూరుకు వెళ్లి ఆంజనేయులు అనే వ్యక్తితో రవికి ఫోన్ చేయించి మద్యం తాగుదామని పిలిపించారు. వారి వద్దకు వచ్చిన రవిని కారులో ఎక్కించుకుని గ్రామ సమీపంలోని శ్మశానవాటిక వద్దకు వెళ్లి మద్యం తాగారు. రవి మత్తులోకి వెళ్లిన తర్వాత అందరూ కలిసి అతడి ముఖానికి ప్లాస్టిక్ కవర్లు చుట్టి ఊపిరాకుండా చేసి చంపారు.
ఎవరికీ అనుమానం రాకూడదని కొత్త సూగూరు ఊరి బయట రోడ్డు పక్కన శవాన్ని ఉంచి, నేరానికి ఉపయోగించిన ప్లాస్టిక్ కవర్లను బూడిదపాడు వద్ద వాగులో పడేసి వెళ్లిపోయా రు. మృతుడి భార్య సునీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. సాంకేతిక పరిజ్ఞానంతో దర్యాప్తు చేపట్టారు. సునీతను తమదైన శైలిలో విచారించగా.. చేసిన నేరాన్ని ఒప్పుకుంది. హత్య లో పాల్గొన్న వారిని అరెస్టు చేసి.. వారి నుంచి కారు, సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపర్చగా.. రిమాండ్ విధించినట్టు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ రాంబాబు, స్పెషల్ బ్రాంచ్ సీఐ నరేష్, పెబ్బేరు ఎస్ఐ యుగంధర్ రెడ్డి ఉన్నారు.