
స్పష్టం చేసిన మాజీ ఆర్మీ అధికారులు
ఆపరేషన్ సిందూర్.. అవసరమే!
ఉగ్రవాదులపై దాడి చేయడం సరైన చర్య
హైదరాబాద్: ఆపరేషన్ సిందూర్కు అపూర్వ స్పందన లభిస్తోంది. ఉగ్రవాదులను తుదముట్టించేందుకు ఇదే సరైన చర్య అని మాజీ ఆర్మీ అధికారులు భావిస్తున్నారు. అవసరమైతే తాము కూడా యుద్ధంలో పాల్గొనడానికి సిద్ధమని ప్రకటిస్తున్నారు. ఆర్మీ, నేవీ, వాయుసేన (Air Force) సంయుక్తంగా చేపట్టిన ఈ ఆపరేషన్పై కంటోన్మెంట్లోని పలువురు ఆర్మీ అధికారులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈసారి యుద్ధం వస్తే, అధికారుల నుంచి పిలుపు వస్తే పాల్గొనటానికి సిద్ధంగా ఉన్నామని రిటైర్డ్ ఆర్మీ జవాన్లు తెలిపారు.
దాడులు చేస్తే సహించేది లేదు
ఆపరేషన్ సిందూర్ సమర్థనీయమే. శక్తివంతమైన మన త్రివిధ దళాల సామర్థ్యం ప్రపంచ దేశాలకు తెలుసు. 1948 మొదలు 1965, 1975, 1999లో పాకిస్థాన్ దేశానికి తగిన గుణపాఠం చెప్పినా తీరు మార్చుకోలేదు. ఉగ్రవాదులు మనదేశంపై దాడులు చేయకుండా పాకిస్తాన్లోని వారి శిబిరాలపై దాడులు చేసేందుకు ఆపరేషన్ సిందూర్ కొనసాగించాలి.
– ఆర్ఆర్ మహాపాత్రో, రిటైర్డ్ ఆర్మీ అధికారి
మరోసారి యుద్ధానికి సిద్ధం
ఒకవేళ పాకిస్తాన్తో యుద్ధం జరిగితే మనదేశం తరఫున యుద్ధంలో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాను. గత కార్గిల్ యుద్ధంలో మద్రాస్ రెజిమెంట్ 27 తరఫున పూంచ్ సెక్టార్ నుంచి పాల్గొన్నాను. పాక్ ముష్కరులపై దాడులు చేశాం. 2006లో ఆర్మీ నుంచి పదవీ విరమణ పొందాను. తాజాగా ఉగ్రవాదులు దాక్కున్న తొమ్మిది స్థావారాలపై మన దళాలు దాడులు జరిపి ఉగ్రవాదులను మట్టుపెట్టి వారి స్థైర్యాన్ని దెబ్బతీశాయి.
– పరమేశ్వర్ సింగ్ సిపాయి, రిటైర్డ్
పాక్కు తట్టుకునేశక్తి లేదు..
ఈసారి పాక్తో యుద్ధం వస్తే మరోసారి పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాను. 1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో యుద్ధ ట్యాంకర్ డ్రైవర్గా 21 మెకనైజ్డ్ ఎనిఫెంట్రి రెజిమెంట్ తరఫున పదకొండు రోజులపాటు జమ్ము, కశ్మీర్లోని మేరినాగ్ బటాపూర్ నుంచి పాల్గొన్నాను. పదకొండు మంది పాక్ సైనికులను అంతమొందించాం. మనదేశానికి చెందిన ఆర్మీ, నేవీ, వాయుసేనను తట్టుకునే శక్తి పాకిస్తాన్కు లేదు.
– కామేశ్వర్ రావు, కార్గిల్ యుద్ధవీరుడు
చదవండి: పాకిస్థాన్ మిస్సైళ్లను గాల్లోనే పేల్చేసిన భారత్